పద్ధతి కావాలో చెప్పండి
ABN , First Publish Date - 2020-12-28T06:47:16+05:30 IST
ఇళ్ల నిర్మాణానికి మూడు పద్ధతుల్లో ఏది కావాలో చెప్పాలంటూ సోమవారం నుంచి వలంటీర్లు సర్వే చేపట్టనున్నారు.
ఇళ్ల నిర్మాణంపై నేటి నుంచి వలంటీర్ల సర్వే
కలికిరి, డిసెంబరు 27: ఇళ్ల నిర్మాణానికి మూడు పద్ధతుల్లో ఏది కావాలో చెప్పాలంటూ సోమవారం నుంచి వలంటీర్లు సర్వే చేపట్టనున్నారు. వారు ఎంచుకునే పద్దతుల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కట్టబోయే ఇళ్లన్నీ ఒకే డిజైన్తో ఉండాలనేది నిబంధన. కాకుంటే కట్టేందుకు మాత్రం మూడు పద్ధతులను తీసుకొచ్చింది. లబ్ధిదారులు ఎంచుకునే పద్ధతిని వలంటీర్లు యాప్లో నమోదు చేయాలి. లబ్ధిదారులే ఐచ్ఛికంగా ఎంచుకున్నారనేందుకు ఆధారంగా మరో ఫారంలో వారి సంతకాలను కూడా తీసుకోనున్నారు. రూ.1.8 లక్షలతో నిర్మించనున్న ఈ గృహాలను మూడేళ్ల వ్యవధిలో విడతల వారీగా చేపట్టనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది ఎంచుకునే పద్ధతి ఆధారంగా అదే కేటగిరీకి చెందిన ఇళ్లు మొదటి ఏడాది, రెండో వర్గీకరణలో వచ్చే ఇళ్ళను రెండో ఏడాది, మిగిలిన వాటిని మూడో సంవత్సరం మంజూరు చేస్తారని అంటున్నారు. ఇలాగైతే ఒకే లేఔట్లో మూడు వర్గీకరణల కింద లబ్ధిదారులు విడిపోతే ఆ మొత్తం ఇళ్ల నిర్మాణం పూర్తికావడానికి మూడేళ్లు పడుతుందనే అనుమానాలున్నాయి.
మొదటి పద్ధతి: ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని (కమ్మీ, సిమెంటు) ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. కూలీల చార్జీలను మాత్రం లబ్ధిదారులకు చెల్లిస్తుంది.
2వ పద్ధతి: ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని లబ్ధిదారులు తమకు నచ్చిన చోట నుంచి తెచ్చుకోవచ్చు. వీటితో ఇంటి నిర్మాణం చేపడితే పురోగతినిబట్టి దశల వారీగా వారి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నగదు జమ చేస్తుంది.
3వ పద్ధతి: ఇంటి నిర్మాణం తమకు సాధ్యం కాదని చెబితే సామగ్రిని సరఫరా చేయడంతోపాటు నిర్మాణానికి అవసరమైన పూర్తి సహకారాన్ని ప్రభుత్వమే దగ్గరుండి అందిస్తుంది.