భయం.. భయంగా బడికి !
ABN , First Publish Date - 2020-11-03T09:10:16+05:30 IST
కరోనా లాక్డౌన్ కారణంగా మూతబడ్డ పాఠశాలలు సుమారు ఏడు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయ్యాయి.
తొలిరోజు 38శాతం హాజరైన విద్యార్థులు
ఎక్కడా కనిపించని థర్మల్ స్ర్కీనింగ్
నామమాత్రంగా శానిటైజేషన్
ప్రైవేటు పాఠశాలల యజమానుల విముఖత
తెరవాలంటూ నిర్వాహకులతో కలెక్టర్ సమీక్ష
చిత్తూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరోనా లాక్డౌన్ కారణంగా మూతబడ్డ పాఠశాలలు సుమారు ఏడు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయ్యాయి. ప్రజల్లో కరోనా గురించి ఇంకా ఆందోళనలు తొలగలేదు. జిల్లాలో 9, 10వ తరగతి విద్యార్థులు 69,197 మంది ఉండగా.. తొలిరోజు సుమారు 26,394 మంది, అంటే 38శాతం హాజరయ్యారు. తల్లిదండ్రుల్లో నెలకొన్న భయాందోళన కారణంగా హాజరుశాతం తక్కువగా ఉంది. ప్రాంతాలను బట్టి కొన్ని పాఠశాలల్లో 60శాతం కూడా హాజరయ్యారు. మంగళవారం నుంచి ఓ రోజు తొమ్మిది, మరో రోజు టెన్త్ విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు.
విద్యార్థులంతా మాస్కులు ధరించి, భౌతికదూరాన్ని పాటించారు. కానీ.. ఎక్కడా థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు, గదుల్లో శానిటైజేషన్ చేయలేదు. దీంతో చాలా వరకు తరగతులను ఆరుబయటే నిర్వహించారు. సోమవారం ప్రభుత్వ పాఠశాలలే తెరచుకున్నాయి. తిరుపతి, చిత్తూరు వంటి నగరాల్లో ఒకటీ రెండు పాఠశాలలు మినహా జిల్లా అంతటా ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభించలేదు.
తెరచుకోని ప్రైవేటు పాఠశాలలు
ప్రైవేటు పాఠశాలలు తెరిచే విషయంలో యాజమాన్యాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఏదైనా జరిగితే పాఠశాలకు చెడ్డపేరు వస్తుందని ప్రైవేటు యాజమాన్యాలు భావిస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటించాలంటే నిర్వహణా భారమవుతుందని కూడా కొందరు భావిస్తున్నారు. దీంతో కలెక్టర్ భరత్గుప్తా సోమవారం కలెక్టరేట్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. కరోనా నిబంధనలు పాటించి పాఠశాలలు తెరవాలని కోరారు. ప్రైవేటు స్కూల్స్ అసోషియేషన్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, కార్యదర్శి రమేష్బాబు, ట్రెజరర్ లోకేష్ సభ్యులు రంగయ్య, గుణశేఖర్, నాగరాజు పాల్గొన్నారు.
ప్రాంతాలను బట్టి హాజరు
జిల్లా అంతటా 9, 10 తరగతి విద్యార్థుల హాజరుశాతం 38గా ఉన్నా.. ప్రాంతాలను బట్టి ఇది 20 నుంచి 60 వరకు ఉంది. తిరుపతి డివిజన్లో 131 ఉన్నత పాఠశాలల్లో 7,597 మందికిగాను 3,181 మంది, అలాగే తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో తొమ్మిది హైస్కూల్స్లో 1038కిగాను 392 మంది హాజరయ్యారు. చిత్తూరు కన్నన్ పాఠశాలలో వంద మంది ఉంటే.. 40 మంది, పీసీఆర్ ఉన్నత పాఠశాలలో 250కి 150 మంది హాజరయ్యారు. చౌడేపల్లె హైస్కూల్లో 300 ఉంటే 25 మంది, గుడుపల్లె మండలం ఎమిగనిపల్లె ఉన్నత పాఠశాలలో 110కి 37 మంది, శాంతిపురం హైస్కూల్లో 246కి 69 మంది, పీలేరు హైస్కూల్లో 208కి 78 మంది, మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో 500కి 157 మంది, సదుం హైస్కూల్లో 260కి వంద మంది, బైరెడ్డిపల్లె హైస్కూల్లో 208కి 35మంది, ఐరాల హైస్కూల్లో 213కి 93 మంది, ములకలచెరువు హైస్కూల్లో 295కి 122 మంది, పలమనేరు మండలం నక్కపల్లె హైస్కూల్లో 25కి 22 మంది, పుంగనూరు మండలంలో 2076కి 717 మంది, తంబళ్లపల్లె హైస్కూల్లో 137కి 25 మంది, పాకాల హైస్కూల్లో 400 మందికిగాను 120 మంది హాజరయ్యారు.