వేయని రోడ్లకు బిల్లులు డ్రా చేస్తారా?
ABN , First Publish Date - 2020-10-04T08:39:05+05:30 IST
చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లె పంచాయతీలో శనివారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది.
రామిరెడ్డిపల్లెలో గ్రామసభ రసాభాస
చంద్రగిరి, అక్టోబరు 3: చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లె పంచాయతీలో శనివారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. వేయని రోడ్లకు బిల్లులు డ్రా చేశారంటూ గ్రామస్తులు సభను బహిష్కరించారు. ప్రతి నెలా సభను నిర్వహించాలని కోరినా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఎంపీడీవో రాధమ్మకు ఫిర్యాదు చేస్తే ఇప్పుడీ సమావేశం నిర్వహించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులు ఖర్చు పెట్టారని పంచాయతీ కార్యదర్శిని మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యంయాదవ్ ప్రశ్నించారు.
అందుకాయన తమ వద్ద రికార్డులు లేవని, ఎంపీడీవో కార్యాలయంలో ఉన్నాయని చెప్పారు. అనంతరం గ్రామస్తులతో కలిసి పలు సమస్యలను సుబ్రహ్మణ్యం యాదవ్ సభ దృష్టికి తెచ్చారు. 2019 ఏప్రిల్లో రామిరెడ్డిపల్లె పంచాయతీలోని కూచివారిపల్లె నుంచి బందార్లపల్లె వద్ద ఉన్న శ్మశాన వాటికకు రోడ్డు నిర్మించకుండానే రూ.2.3 లక్షలను, రామిరెడ్డిపల్లె నుంచి కూచివారిపల్లె హరిజనవాడకు రోడ్డు వేయకుండానే రూ.1.4లక్షలను, పంచాయతీలోని వంకలోనూ రోడ్డు నిర్మాణం చేపట్టకనే రూ.2.40 లక్షలను డ్రా చేశారని ఆరోపించారు. ఈ విధంగా రూ.5.50 లక్షల పంచాయతీ నిధులు స్వాహా చేశారన్నారు. దీనిపై పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇక కరోనా బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులంటూ కొందరి విషయంలో రాజకీయ నాయకులు కక్షపూరితంగా వ్యవహరించారన్నారు.
ఎటువంటి సంబంధం లేకున్నా కరోనా అనుమానితులుగా కొందరి పేర్లను సూచించారన్నారు. దీనిపై సంబంధిత కార్యదర్శి, వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని వాపోయారు. అధికారపార్టీ నాయకుల అండదండలతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వీరడిగిన ప్రశ్నలకు పంచాయతీ కార్యదర్శి సమాధానం ఇవ్వకపోవడంతో సభను బహిష్కరిస్తున్నామంటూ వెళ్లిపోయారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి నిధుల స్వాహాపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.