అమ్మకు వందనం
ABN , First Publish Date - 2020-05-10T08:00:29+05:30 IST
ఈమె పేరు కన్నమ్మ. నివాసం యాదమరి మండలం కీనాటంపల్లె. ఇద్దరు బిడ్డల తల్లి. చిత్తూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్టు పారిశుధ్య ..
![అమ్మకు వందనం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051001843/05102020023019n74.jpg)
నేడు మాతృదినోత్సవం
ఆంధ్రజ్యోతి, చిత్తూరు: ఈమె పేరు కన్నమ్మ. నివాసం యాదమరి మండలం కీనాటంపల్లె. ఇద్దరు బిడ్డల తల్లి. చిత్తూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలు. పని ముగించుకుని రోజూ పండో, తీపో ఇంటికి తీసుకువెళ్ళి బిడ్డలతో గడిపేది. కరోనాతో పోరాటంలో కనిపించని వైరస్ను ఇంటికి మోసుకువెళ్ళే ప్రమాదం ఉందని తెలిసిన కన్నమ్మ, కన్న పేగు తీపిని చంపుకుని ఇంటికి దూరంగా నెలన్నరగా ఉంటోంది. నగరంలోనే ఒక గది అద్దెకు తీసుకుని బిడ్డల్ని తలచుకుంటూ విధులు నిర్వహిస్తోంది. నగర క్షేమమే బాధ్యతగా భావించి అమ్మలా అందరికీ సేవలందిస్తోంది.
కరోనా భయం కన్నా ..
తిరుపతి, ఆంధ్రజ్యోతి : తిరుపతిలో చెట్టుకి కట్టిన ఉయ్యాలలోంచి బిడ్డను ఎత్తుకుని ముద్దులాడుతున్న ఈ అమ్మది ఈ ఊరు కాదు. ఉత్తరాది కార్మికురాలు. భూగర్భ విద్యుత్ కేబుల్ పనుల కోసం కడుపునీ, కన్నబిడ్డనీ చేతబట్టుకుని తిరుపతికి చేరుకుంది. పనిచేస్తేనే కడుపు నిండుతుంది తనకూ తన బిడ్డకీ కూడా. పని జరిగే తావులో పచ్చని చెట్టునే ఇల్లుగా మార్చుకుని, చీర ఉయ్యాలలో బిడ్డను నిద్ర పుచ్చుతుంది. నిద్రలేచి బిడ్డ ఏడవగానే వచ్చి పాలిచ్చి సముదాయించి మళ్ళీ పనిలో పడుతుంది. కరోనా భయం కన్నా కడుపాకలి విలువైనది అని తెలిసిన అమ్మ కదా మరి!