కాంగ్రెస్‌కు తిరుపతి కంచుకోట

ABN , First Publish Date - 2020-12-20T05:07:34+05:30 IST

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట వంటిదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు తిరుపతి కంచుకోట
మీడియాతో మాట్లాడుతున్న తులసిరెడ్డి

5న అభ్యర్థిని ప్రకటిస్తాం

రాష్ట్రానికి ప్రత్యేక హోదాను 

బీజేపీ ఇవ్వలేదు, వైసీపీ సాధించలేదు

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి

తిరుపతి(తిలక్‌రోడ్డు), డిసెంబరు 19: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట వంటిదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో 12 పర్యాయాలు కాంగ్రెస్‌ గెలిచిందని చెప్పారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలోనూ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జనవరి ఐదో తేదీన అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదాను బీజేపీ ఇవ్వలేదు.. వైసీపీ సాధించలేదు’ అని స్పష్టం చేశారు. 2014లో తిరుపతిలో జరిగిన బహిరంగ సభలోనూ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చి, మోసం చేశారన్నారు. హోదా కోసం తిరుపతికి చెందిన మునికోటి కూడా ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రస్తుతం రాష్ర్టాన్ని శని, రాహువు, కేతువు గ్రహాలుగా బీజేపీ, వైసీపీ, టీడీపీలు పట్టి పీడిస్తున్నాయన్నారు. కాగా.. కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన  వ్యవసాయ చట్టాలు రైతుల మెడకు ఉరితాడులా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను రద్దు చేయడానికి మోటర్లుకు విద్యుత్‌ మీటర్లను సీఎం జగన్‌ బిగిస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నిక నిర్వహణకు ఎన్‌.తులసిరెడ్డి, వై.సుమంత్‌రెడ్డి, ప్రమీలమ్మ, దేవారెడ్డి, వెంకటనరసింహులు, రామచంద్రాలను సమన్వయ కమిటీ సభ్యులుగా పీపీసీ అధ్యక్షుడు శైలజానాఽథ్‌ ప్రకటించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో రాంభూపాల్‌రెడ్డి, నారాయణ, చిట్టిబాబు పాల్గొన్నారు.

Read more