కలికిరి జేఎన్టీయూ కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్
ABN , First Publish Date - 2020-12-03T06:32:03+05:30 IST
కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల కొత్త ప్రిన్సిపాల్గా వెంకటేశ్వర రావును నియమిస్తూ అనంతపురం జేఎన్టీయూ వర్సిటీ రిజిస్ట్రారు ఉత్తర్వులు జారీ చేశారు.

కలికిరి, డిసెంబరు 2: కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల కొత్త ప్రిన్సిపాల్గా వెంకటేశ్వర రావును నియమిస్తూ అనంతపురం జేఎన్టీయూ వర్సిటీ రిజిస్ట్రారు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతమున్న ప్రిన్సిపాల్ విశాలిని అనంతపురం యూనివర్సిటీకి బదిలీ చేశారు. కొత్త ప్రిన్సిపాల్గా నియమితులైన వెంకటేశ్వర రావు అనంతపురంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ రెండేళ్ళ క్రితం ప్రొఫెసర్గా పదోన్నతి పొంది కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్ విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. అధ్యాపకులు, సిబ్బంది సహకారంతో కళాశాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. కాగా గత సంవత్సరం ఫిబ్రవరిలో విశాలిని ఇక్కడ ప్రిన్సిపాల్గా నియమించారు. అప్పటి వరకూ ఇదే కళాశాలలో ఫ్యాకల్టీగా రాణించిన ఆమె ప్రిన్సిపాల్గా విఫలమయ్యారనే అభిప్రాయాలున్నాయి. కళాశాలలో ప్రతిష్టాత్మకంగా కొత్తగా ప్రారంభించిన ఫుడ్ టెక్నాలజీ కోర్సును ఆశించిన స్థాయిలో విజయవంతం చేయలేకపోయారనే అపప్రధ తెచ్చుకున్నారు. జేఎన్టీయూ పరిధిలో కలికిరిలో మాత్రమే ఫుడ్ టెక్నాలజీ కోర్సు ప్రవేశపెట్టారు. కావలసినన్ని మౌళిక వనరులు, వసతులు అందుబాటులో వున్నా పాలనాపరమైన వైఫల్యాలతో ఆ కోర్సు విద్యార్థులను నిరుత్సాహానికి గురి చేసిందనే ప్రచారముంది. ఇటీవల కంప్యూటర్లు మాయమైన సంఘటన పాలనా వైఫల్యాలను పతాక స్థాయికి చేర్చిందనే విమర్శలు కూడా వున్నాయి. వివిధ స్థాయిల్లో అస్తవ్యస్తంగా తయారైన కళాశాల నిర్వహణను కొత్త ప్రిన్సిపాల్ గాడిన పెట్టాల్సి వుంది.