గ్రీన్ అంబాసిడర్ల పోరాటం
ABN , First Publish Date - 2020-04-08T11:50:52+05:30 IST
కరోనా వైరస్కు సైతం గ్రీన్ అంబాసిడర్ సైన్యం చూస్తే బెరుకే. నగరి నియోజకవర్గంలోని నిండ్ర పెద్ద గ్రామ పంచాయతీ. 3 వేల జనాభా ఉన్న

పుత్తూరు: కరోనా వైరస్కు సైతం గ్రీన్ అంబాసిడర్ సైన్యం చూస్తే బెరుకే. నగరి నియోజకవర్గంలోని నిండ్ర పెద్ద గ్రామ పంచాయతీ. 3 వేల జనాభా ఉన్న ప్రాంతంలో గ్రామీణ వాతావరణమే కనిపిస్తుంది. అలాంటి ప్రాంతంలో ఈనెల 5వతేది కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో నిండ్ర మండలం కొప్పేడు, ఎలకాటూరు, కీలంబాకం, కచ్చరవేడు, అగరం పంచాయతీలను రెడ్జోన్గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో సేవలందించేందుకు పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన గ్రీన్ అంబాసిడర్లు రాజేష్, రామయ్య, దేవరాజులు, సుధాకర్ బృందం రంగంలోకి దిగింది. రక్షణ గౌన్లు, గ్లౌజ్లు, మాస్క్లు, ప్రత్యేక రక్షణ పరికరాలు ధరించి విధుల్లో మునిగారు. యుద్ధంలో సైనికుల్లా ట్రాక్టర్లకు స్ర్పేగన్లు బిగించి పిచికారీ పనులు చేపట్టారు.
తొలుత కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లగా ఆయన కుటుంబీకులు అంగీకరించలేదు. దీంతో ఎమ్మెల్యే రోజా జోక్యం చేసుకోవడంతో పనులు పూర్తి చేశారు. పీపీఈ సూట్ కారణంగా ఎండల్లో ఉక్కపోతలు పెడుతున్నా పట్టువదలని విక్రమార్కుల్లా రెడ్జోన్ పరిధిలో పనులు చేస్తున్నారు. ఈ నలుగురి వెంట మరో 11 మంది పారిశుధ్య కార్మికులుంటూ సున్నం కలిపిన బ్లీచింగ్ మిశ్రమాన్ని మురుగు కాలువలు, వీధుల్లో చల్లుతున్నారు. మొత్తం 15 మంది సభ్యులున్న సైన్యాన్ని మున్సిపల్ కమిషనర్ నాగేంద్రప్రసాద్ ముందుండి నడిపిస్తున్నారు.