అదృశ్యమైన ఆటోడ్రైవర్ మృతదేహం వాగులో లభ్యం
ABN , First Publish Date - 2020-11-30T06:46:38+05:30 IST
అదృశ్యమైన ఆటోడ్రైవర్ రామచంద్రారెడ్డి మృతదేహాన్ని ఆదివారం ఉదయం పీలేరు మండలం గూడరేవుపల్లె సమీపంలోని వంకలో గ్రామస్తులు గుర్తించారు.
పీలేరు, నవంబరు 29: అదృశ్యమైన ఆటోడ్రైవర్ రామచంద్రారెడ్డి మృతదేహాన్ని ఆదివారం ఉదయం పీలేరు మండలం గూడరేవుపల్లె సమీపంలోని వంకలో గ్రామస్తులు గుర్తించారు. పీలేరు మండలం తలపుల పంచాయతీ ముంతావారిపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి(45) ఆటో తోలుకుని జీవనం సాగించేవాడు. గురువారం సాయంత్రం ఆటోలో బయటకు వెళ్లిన రామచంద్రారెడ్డి అప్పటి నుంచి కనిపించడంలేదు. కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం గూడరేవుపల్లె వంకలో ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ తిప్పేస్వామి సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించారు. చనిపోయిన వ్యక్తి రామచంద్రారెడ్డిగా గుర్తించి కుటుంబీకులకు విషయాన్ని తెలియజేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. గురువారం రాత్రి గూడరేవుపల్లె వంక ఉధృతంగా ప్రవహించిందని ఆ సమయంలో వంక దాటుతూ రామచంద్రారెడ్డి వాహనం సహా కొట్టుకుపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.