భౌతికదూరం పాటిస్తూ సినిమా వీక్షించండి
ABN , First Publish Date - 2020-12-31T04:38:41+05:30 IST
ప్రేక్షకులందరూ భౌతికదూరం పాటిస్తూ సినిమా వీక్షించాలని హీరో సాయిధరమ్తేజ్ కోరారు.
ప్రేక్షకులకు హీరో సాయిధరమ్తేజ్ సూచన
తిరుచానూరు, డిసెంబరు 30: ప్రేక్షకులందరూ భౌతికదూరం పాటిస్తూ సినిమా వీక్షించాలని హీరో సాయిధరమ్తేజ్ కోరారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ప్రదర్శిస్తున్న తిరుపతిలోని పీజీఆర్ థియేటర్ వద్దకు బుధవారం ఉదయం ఆయన చేరుకున్నారు. థియేటర్లోని ప్రేక్షకులకు అభివాదం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలోనూ ఈ సినిమాను పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ‘ప్రతిరోజు పండుగే’ సినిమా కూడా పీజీఆర్లో విడుదలైందని గుర్తుచేశారు. దీంతో ఈ థియేటర్ తనకు లక్కీ అని భావిస్తున్నానన్నారు. 20-30 ఏళ్ల యువకుడి జర్నీలో ఒంటరిగా ఉంటే ఎదురయ్యే సమస్యలు, పరిస్థితులు, తను ఎంచుకున్న మార్గం తప్పని గ్రహించడం.. ఈ సినిమాలో చూపామన్ననరు. యువత బతుకుపై అయోమయంలో ఉందని, తల్లిదండ్రులు, జీవిత సహచరి, స్నేహితులతో ఎలా మెలగాలో సినిమాలో చూపామన్నారు. హీరోగా నటించడమే తనకు ఇష్టమని, మిగిలిన వాటిపై దృష్టిసారించనన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను కొందరు అభిమానులు గజమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని పాండ్రవేటి అభిషేక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.