ఎర్రజీకుపేటులో చిక్కుకున్న కాపరులు
ABN , First Publish Date - 2020-11-28T05:37:11+05:30 IST
గాలి తీవ్రతతో గొర్రెలకాపరులు ఎర్రజీకుపేటు అటవీ ప్రాంతంలో వద్ద తల దాచుకున్నారు
రైతులకు చెందిన ఐదువందల గొర్రెలు, మేకల గల్లంతు
బీరప్పచెరువు మొరవలో 50 మేకల కళేబరాలు
క్షేమంగా 32 మేకలు
ఐరాల, నవంబరు 27: మండలంలోని రైతులకు చెందిన 500 గొర్రెలు, మేకలు గల్లంతయ్యాయి. ఐరాల మండలం ఎర్రజీకుపేటు అటవీ ప్రాంతంలో నివర్ తుఫాన్ కారణంగా గురువారం గొర్రెలకాపరులు అడవిలో చిక్కున్నారు. వారంగా నయనంపల్లెకు చెందిన రాజగోపాల్, పి.నాగరాజు, మహేంద్రబాబు, ఎం.నాగరాజు మేకలు, గొర్రెలు కాచుకుంటు అడవిలోనే ఉన్నారు. దీంతో వారికి నివర్ తుఫాన్ సమాచారం తెలియకుండా పోయింది. గురువారం సాయంత్రం ఉన్నట్లుండి వర్షం కురవడంతో అడవిలో వాగులు పొంగడంతో గొర్రెలు, మేకలు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. కాపరులు వాటిని కాపాడటానికి ప్రయత్నించారు. గాలి తీవ్రతతో వారికి సాధ్యపడలేదు. చేసేది లేక అటవీ ప్రాంతంలోని గృహం వద్ద తల దాచుకున్నారు. శుక్రవారం ఉదయం బీరప్పచెరువు మొరవలో మేకలు, గొర్రెలు కొట్టుకొస్తుండడంతో గ్రామస్తులు పట్టుకున్నారు. వాటిలో మల్లేశంకరానికి చెందిన 32 మేకలు ప్రాణాలతో లభించాయి. 50 మేకల కళేబరాలు కొట్టుకొచ్చాయి. మిగిలిన మేకలు, గొర్రెల జాడ తెలియలేదు. మేకలు గల్లంతు కావడంతో తమకు రూ.50 లక్షలు నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. మండలంలోని బొమ్మసముద్రంలో యాదమరి మండలానికి చెందిన మణిగండన్ జీవనోపాధి కోసం మేపుతున్న నాలుగు వేల బాతు పిల్లలు మృతి చెందాయి.