కరోనా శాపమై..బతుకు భారమై
ABN , First Publish Date - 2020-07-27T11:26:58+05:30 IST
కరోనా మహమ్మారి ప్రభావం ప్రైవేటు బడుల గురువులపైనా పడింది.నాలుగు నెలలుగా జీతాలు లేకపోవడంతో బతుకు బండి లాగడానికి

ఇతర వృత్తుల్లోకి బడి పంతుళ్లు
శ్రీకాళహస్తి, జూలై 26: కరోనా మహమ్మారి ప్రభావం ప్రైవేటు బడుల గురువులపైనా పడింది.నాలుగు నెలలుగా జీతాలు లేకపోవడంతో బతుకు బండి లాగడానికి కొంతమంది గురువులు కూలీలుగా మారిపోయారు. మరికొంతమంది ఇతరత్రా పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నారు.
జిల్లాలో 3వేలకు పైగా ప్రైవేటు బడులున్నాయి.10వేల మందికి పైగా పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులు గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారే.లక్షలాది మంది విద్యార్థులకు బోధనతో మంచి భవిష్యత్తు ఇస్తున్న గురువులకు కరోనా కష్టాలు వచ్చి పడ్డాయి.మార్చి నెల 19వ తేదీ నుంచి అర్ధంతరంగా బడులు మూతపడడంతో యాజమాన్యాలకు వసూలు కావాల్సిన ఫీజులు కూడా దాదాపు 40-50శాతం ఆగిపోయాయి.దీంతో ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకుండా ఆపేశాయి. కార్పొరేటు విద్యాసంస్థల పరిస్ధితి పక్కన పెడితే...సుమారుపాటి పాఠశాలలు నిర్వహించుకునే వారంతా ఇబ్బందుల్లోనే వున్నారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు చెల్లించలేక బాధపడుతున్నారు.
శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తెలుగు టీచరుగా పని చేస్తుండిన ఈయన పేరు చంద్రశేఖర్. పాఠశాల మార్చి నెలలో మూత పడింది. అప్పటి నుంచి జీతాలు ఇవ్వడం మానేయడంతో బేల్దారి కూలీగా మారాడు.
శ్రీకాళహస్తిలో పేరు గడించిన ఓ ప్రైవేటు పాఠశాలలలో ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా పని చేస్తుండిన ఈయన పేరు ప్రశాంత్కుమార్. ఇంగ్లీషు బోధనలో దిట్ట అని పేరుంది. కరోనా ఈయన పాలిట శాపంగా మారింది. నాలుగు నెలలుగా జీతాల్లేవు.చివరకు మిత్రులకు సాయంతో కైలాసగిరి కాలనీలో కొబ్బరి బోండాల దుకాణం ప్రారంభించాడు. దానికి తోడుగా ఇంట్లో పిండి రుబ్బే మెషిన్ పెట్టుకున్నాడు. ఆ రెండింటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు బడిలో కొన్నేళ్లుగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఈయన పేరు సుధాకర్.మిగతా ఉపాధ్యాయులలాగే కరోనాతో బతకడానికి మార్గం మూసుకుపోయింది.దీంతో శనగనూనె, కొబ్బరినూనె వంటివి పల్లెలకు తీసుకువెళ్లి విక్రయిస్తున్నాడు. పెద్దగా ఆదాయం లేక పోయినా పూట గడుస్తోందంటున్నాడు.