చెన్నంపల్లెలో ఇళ్ల పట్టాల రగడ
ABN , First Publish Date - 2020-12-30T05:11:20+05:30 IST
ఏర్పేడు మండలంలోని చెన్నంపల్లె పంచాయతీలో ఇళ్లపట్టాలను అందిస్తామని గ్రామ వలంటీర్లు కొందరి వద్ద డబ్బులు వసూలు చేశారు
వసూళ్లకు పాల్పడిన వలంటీర్లపై తహసీల్దారుకు ఫిర్యాదులు
ఏర్పేడు, డిసెంబరు 29: మండలంలోని చెన్నంపల్లె పంచాయతీలో ఇళ్లపట్టాలను అందిస్తామని గ్రామ వలంటీర్లు కొందరి వద్ద డబ్బులు వసూలు చేశారు. అయితే వారికి పట్టాలు అందకపోవడంతో తహసీల్దారు ఉదయ్ సంతోష్కు ఫిర్యాదు చేశారు. ఇళ్లపట్టాలను అందిస్తామని చెప్పి పట్టాకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు తమ వద్ద వసూలు చేశారని, తమకు ఇవ్వకపోగా అనర్హులకు పట్టాలిచ్చారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో తహసీల్దారు ఉదయ్సంతోష్, వైసీపీ మండల ఇన్చార్జి కిషోర్రెడ్డి మంగళవారం చెన్నంపల్లెలో పర్యటించారు. పట్టాలను అందిస్తామని బాధితులకు నచ్చచెప్పారు. అనంతరం తహసీల్దారు ఉదయ్సంతోష్ చెన్నంపల్లెలో సచివాలయ సిబ్బందితో సమావేశమ య్యారు. ఎవరైనా ఇళ్ల పట్టాల విషయంలో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని సచివాలయ అధికారులను ఆదేశించారు. పేదల వద్ద వసూళ్లకు పాల్పడిన వలంటీర్లపై విచారణ జరిపి విధుల నుంచి తొలగిస్తామని తహసీల్దారు చెప్పారు. దీంతో చెన్నంపల్లెలో ఇళ్లపట్టాల రగడ సద్దుమణిగింది.