10.59 ఎకరాలున్నాయంట!

ABN , First Publish Date - 2020-09-14T10:59:42+05:30 IST

పలమనేరు పట్టణం నాగమంగళంకు చెందిన రసూల్‌, సపూరాబీ వృద్ధ దంపతులకు సెంటు భూమి లేదు.

10.59 ఎకరాలున్నాయంట!

సెంటు భూమిలేని వృద్ధ దంపతులకు అధికారుల సమాధానం 

‘ఆసరా’కు అనర్హులని దరఖాస్తు తిరస్కరణ 



మాకు 10.59 ఎకరాల భూమి ఉందంటున్నారు. ఆ భూమి ఎక్కడుందో చూపించి మాకు ఒక ఎకరా ఇవ్వండి చాలు. మిగిలిందంతా మీరే తీసుకోండి. 

 

సెంటు భూమిలేకున్నా పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తున్న అధికారులకు వృద్ధ దంపతుల వినతి 


పలమనేరు,సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): పలమనేరు పట్టణం నాగమంగళంకు చెందిన రసూల్‌, సపూరాబీ వృద్ధ దంపతులకు సెంటు భూమి లేదు.  ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న వీరి ఇంటికి ప్రభుత్వం స్వాధీన అనుభవ ధ్రువపత్రాన్ని అందజేసింది. మూడేళ్ల కిందట జాతీయ రహదారి విస్తరణలో వీరి ఇంటిని అధికారులు కూల్చేశారు. అప్పట్నుంచి పట్టణ సమీపంలోని ఎంబీఎస్‌ కాలనీలో అద్దె ఇంట్లో వీరు నివాసం ఉంటున్నారు. నివేశస్థలానికి దరఖాస్తు చేసుకొంటే ఇదివరకే ఇల్లు ఉందంటూ అధికారులు వీరి దరఖాస్తును తిరస్కరించారు. తాము అద్దె ఇంట్లోకి చేరిన విషయాన్ని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదు. చివరకు సపూరాబీ వైఎస్సార్‌ చేయూత పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే... ఈ వృద్ధ దంపతులకు 10.59 ఎకరాలు ఉన్నందున అనర్హురాలిగా ప్రకటిస్తున్నట్లు వీరి దరఖాస్తును తిరస్కరించారు. తమకులేని భూమి ఎక్కడుందో తెలుసుకుందాని ‘మీ భూమి’ పోర్టరులో దరఖాస్తు చేసుకుంటే.. తమ పేరిట సెంటు భూమి కూడా లేదని సర్టిఫికెట్‌ ఇచ్చారన్నారు. ఈ సర్టిఫికెట్‌ తీసుకుని మళ్లీ అధికారుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకొన్నా మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్నారు. అక్కడితో ఆగకుండా వీరు కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు తమ వినతిపత్రాన్ని సీఎంవోకు పంపారు. ‘మీ ఇంటి స్థల మంజూరు సమస్య పరిష్కారానికి పలమనేరు తహసీల్దారుకు ఈ వినతిని పంపాం’ అంటూ నెల కిందట సీఎం కార్యాలయం నుంచి వీరికి మెసేజీ వచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. తమకు ప్రభుత్వ పథకాలు ఇవ్వకపోతే పోయారు.. ఆ 10.59 ఎకరాల్లో ఒక ఎకరా ఇవ్వండి చాలంటూ అధికారులను కోరుతున్నారు. 

Updated Date - 2020-09-14T10:59:42+05:30 IST