పీఎస్కే నేతను కోర్టులో హాజరుపరచండి
ABN , First Publish Date - 2020-12-11T06:24:36+05:30 IST
మదనపల్లె శివారు వైఎస్సార్ కాలనీకి చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య (పీఎస్కే) జిల్లా నాయకుడు ఆంజనేయులును బుధవారం గుంటూరు పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
పౌర హక్కుల సంఘం నాయకుల డిమాండ్
మదనపల్లె అర్బన్, డిసెంబరు 10: మదనపల్లె శివారు వైఎస్సార్ కాలనీకి చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య (పీఎస్కే) జిల్లా నాయకుడు ఆంజనేయులును బుధవారం గుంటూరు పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనలో పోలీసుల తీరును పౌరహక్కుల సంఘం నేతలు గురువారం ఖండించారు. సీపీఐ స్థానిక కార్యాలయంలో పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ గుంటూరు పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చి ఆంజనేయులును అరెస్టు చేసి తీసుకెళ్లడం సరికాదన్నారు. ఆయనపై వారెంట్ ఉంటే స్థానిక పోలీసులను సంప్రదించి తీసుకెళ్లాలన్నారు. కానీ దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి దొంగలా ఆయనను ఈడ్చుకెళ్లడం పద్ధతి కాదన్నారు. ఆంజనేయులుకు ఏదైనా హానిజరిగితే అందుకు పోలీసులే పూర్తిస్థాయిలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 24 గంటల్లోగా న్యాయస్థా నంలో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఆంజనే యులు భార్య సుగుణ మాట్లాడుతూ ఇంట్లో ఉన్న తన భర్తను పోలీసులు ఈడ్చుకుని కారెక్కించి తీసుకెళ్లారన్నారు. తాను ప్రశ్నిస్తే తనను కూడా తీసుకెళ్లి, సీటీఎం వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై స్థానిక పోలీసులను అడగ్గా గుంటూరు పోలీసులు..ఎస్పీని సంప్రదించి, ఆయన అను మతి మేరకు ఆంజనేయులును అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు చిత్తూరు పోలీసుల ద్వారా తెలిసిందన్నారు.