దక్షిణ భారత్ తీర్థయాత్ర
ABN , First Publish Date - 2020-11-13T07:06:45+05:30 IST
డిసెంబరు 12 నుంచి దక్షిణ భారత తీర్థయాత్ర ప్రారంభం కానుంది.
తిరుపతి (ఆటోనగర్), నవంబరు 12: కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో డిసెంబరు 12 నుంచి దక్షిణ భారత తీర్థయాత్రను మొదలుపెట్టనున్నారు. వివరాలను తిరుపతి రైల్వేస్టేషన్లోని వీఐపీ చాంబర్లో గురువారం రైల్వేస్టేషన్ డైరెక్టర్ నాగరమణశర్మ, ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిశోర్ తెలియజేశారు. తిరుచిరాపల్లిలోని శ్రీరంగం ఆలయం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, సముద్రస్నానం ఆచరించవచ్చు, మదురైలోని మీనాక్షి దేవాలయం, కన్నియాకుమారిలోని కుమారి అమ్మన్ దేవాలయం, మహాత్మాగాంధీ, వివేకానంద రాక్ మెమోరియల్స్ తిలకించవచ్చు. ఈ ప్రత్యేక తీర్థయాత్ర రైలు వచ్చేనెల 12న సికింద్రాబాద్లో బయల్దేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వేస్టేషన్ల మీదుగా వెళుతుంది. ఆయా స్టేషన్లలో యాత్రికులను ఎక్కించుకుంటారు. రైలులో 900 మందికి అవకాశం ఉన్నా.. 450 మందితో మాత్రమే యాత్ర నిర్వహిస్తున్నారు. రోడ్డుమార్గంలో ఆలయాలు చేరుకోవడానికి ఉచిత రవాణా వసతి ఉంటుంది. సౌత్ ఇండియా భోజన పెడతారు. కరోనా నియంత్రణ కిట్, రోజుకో మాస్కు ఇస్తారు. రైలులోని ఓ బోగీలో రెండు కూపేలను ఐసొలేషన్ వార్డులుగా ఏర్పాటుచేసి ఉంటారు. ఒక వ్యక్తికి స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.7,140, థర్డ్ ఏసీ అయితే రూ.8610గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు 0877-2222010, 8287932313, 8287932317 నెంబర్లలో సంప్రదించవచ్చు.