ఉప ఎన్నిక ప్రచారానికి ‘పనబాక’ సిద్ధం
ABN , First Publish Date - 2020-11-26T06:10:25+05:30 IST
తిరుపతి లోక్సభ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

28న తిరుపతికి రాక
తిరుపతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్సభ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈమేరకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును బుధవారం ఆమె హైదరాబాద్లో కలిశారు. ఉప ఎన్నికపై చర్చించారు. ఈనెల 28వ తేదీ ఆమె తిరుపతికి రానున్నట్టు తెలిసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలసి ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక నాయకులు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు పనబాక లక్ష్మిపై వదంతులు ప్రచారం చేస్తున్నారని తిరుపతి లోక్సభ కమిటీ అధ్యక్షుడు నరసింహయాదవ్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి సుగుణ, అధికారప్రతినిధి డాక్టర్ ఎన్బీ సుధాకర్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. జగన్ 17 నెలల అవినీతి పాలనకు విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజలు టీడీపీకి మద్దతు పలికి గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు.