గోదాముల నిర్వహణపై అధికారుల దృష్టి
ABN , First Publish Date - 2020-12-11T06:07:52+05:30 IST
గోదాముల నిర్వహణపై అధికారుల దృష్టి
![గోదాముల నిర్వహణపై అధికారుల దృష్టి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 10: జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ పరిధిలోని గోదాముల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. గోదాముల్లో వెలుగుచూస్తున్న అక్రమాలకు అడ్డుకట్టవేసే పనిలో నిమగ్నమయ్యారు. రేణిగుంట, ఏర్పేడు బల్క్ స్టాక్ పాయింట్ల నుంచి స్టేజ్ వన్ కాంట్రాక్టు ద్వారా నిత్యావసరాలను పౌరసరఫరాల సంస్థ పరిధిలోని 28 గోదాములకు సరఫరా చేస్తారు. ఇక్కడి నుంచి స్టేజ్ టూ కాంట్రాక్టర్ ద్వారా గోదాముల పరిధిలోని 2,901 చౌకదుకాణాలకు ప్రతి నెలా 15 నుంచి 30వ తేదీ వరకు 18వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 576 మెట్రిక్ టన్నుల చక్కెర, 10,450 మెట్రిక్ టన్నుల కందిపప్పు సరఫరా చేస్తారు. కానీ గోదాముల నుంచి చౌకదుకాణాలకు వెళ్లే సమయంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఇటీవల కాలంలో వెలుగుచూసింది. తాజాగా నెల్లూరు జిల్లా తడ నుంచి సత్యవేడు మీదుగా అక్రమంగా తరలిపోతున్న 110 టన్నుల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గోదాములపై పర్యవేక్షణ ఎలా ఉందో ఆరా తీసే పనిలో అధికారులున్నారు. స్టాక్ రిజిస్టర్లు మొదలుకుని సీసీ కెమెరాల వరకు నిర్వహణ ఎలా ఉందన్న విషయాలను సంస్థ డీఎంతోసహా పలువురు అధికారులు పరిశీలిస్తున్నారు.