వలంటీరు పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2020-10-03T18:33:00+05:30 IST
జిల్లాలో ఖాళీగా వున్న గ్రామ/వార్డు వలంటీర్ల పోస్టుల భర్తీకి శనివారం జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మండలాలు/మున్సిపాలిటీల వారీగా ఖాళీల వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, దరఖాస్తుల స్ర్కూటినీ, మౌఖిక

కలికిరి(చిత్తూరు జిల్లా): జిల్లాలో ఖాళీగా వున్న గ్రామ/వార్డు వలంటీర్ల పోస్టుల భర్తీకి శనివారం జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మండలాలు/మున్సిపాలిటీల వారీగా ఖాళీల వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, దరఖాస్తుల స్ర్కూటినీ, మౌఖిక ఇంటర్వ్యూలు, నియామక పత్రాల జారీ చేసే తేదీల వివరాలన్నీ ఈ నోటిఫికేషన్లో పొందుపరచనున్నారు. గతంలో రాష్ట్ర స్థాయిలో ఖాళీల వివరాలను నోటిఫై చేసి ఒకే తేదీలతో ఖాళీల్లో నియామక ప్రక్రియను పూర్తి చేసేవారు. అయితే తాజాగా ఆయా జిల్లాల స్థాయిలోనే ఇవన్నీ పూర్తి చేసేందుకు వికేంద్రీకరణ చేసి జాయింట్ కలెక్టర్ల (వలంటీర్లు, సచివాలయాలు, అభివృద్ధి)కే అధికారాలు అప్పగించారు. ఈ మేరకు ఆగస్టు 29న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి సెప్టెంబరు 8 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేశారు. ప్రతి నెలా వలంటీరు పోస్టుల ఖాళీలను ఇదే విధంగా భర్తీ చేయనున్నారు. ఈ విధానంలో భాగంగానే అక్టోబరులో వున్న ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ శనివారం జారీ చేయనున్నారు. ఇందుకోసం శుక్రవారం నాటికి మండలాలు, మున్సిపాలిటీల్లో వున్న ఖాళీల వివరాలను తక్షణం అందజేయాల్సిందిగా జేసీ(వలంటీర్లు, సచివాలయాలు, అభివృద్ధి) శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఎంపీడీవోలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.