యాప్తో ఫొటో తీసి.. పింఛను ఇచ్చేయండి
ABN , First Publish Date - 2020-03-31T12:19:32+05:30 IST
వైఎస్ఆర్ పింఛను కానుక పంపిణీలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసిందని డీఆర్డీఏ
బయోమెట్రిక్ అవసరం లేదు
వలంటీర్లకు డీఆర్డీఏ పీడీ ఆదేశం
చిత్తూరు అర్బన్, మార్చి 30: వైఎస్ఆర్ పింఛను కానుక పంపిణీలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసిందని డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ప్రత్యేక యాప్ను వలంటీర్లు డౌన్లోడ్ చేసుకుని.. లబ్ధిదారుల ఫొటో తీసి, పింఛన్ సొమ్ము ఇచ్చేయాలని ఆదేశించారు. సోమవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో పింఛన్ల పంపిణీపై అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్షించారు.
పింఛన్ల పంపిణీకి అవసరమైన రూ.117.86 కోట్లను సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లో సెర్ప్ జమ చేసిందన్నారు. బ్యాంకుల నుంచి నగదు డ్రాచేసి మంగళవారం సాయంత్రంలోపు వలంటీర్లకు అందజేయాలన్నారు. ఒకటో తేదీన మధ్యాహ్నంలోపు వందశాతం పింఛన్ల పంపిణీ పూర్తిచేయాలన్నారు. సాంకేతిక కారణాలతో ఎక్కడన్నా పూర్తికాకుంటే మరుసటి రోజు పంపిణీ పూర్తిచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఐబీ పీఎం ప్రభావతి, ఏపీవో(పెన్షన్లు) రవి, తదితరులు పాల్గొన్నారు.