యర్రగుంట్ల యువకుడి హత్య
ABN , First Publish Date - 2020-12-11T05:23:47+05:30 IST
శ్రీకాళహస్తి పట్టణం ముత్యాలమ్మగుడివీధిలో ఓ యువకుడు హత్య
శ్రీకాళహస్తి, డిసెంబరు 10: శ్రీకాళహస్తి పట్టణం ముత్యాలమ్మగుడివీధిలో ఓ యువకుడు హత్యకు గురైన ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... కడప జిల్లా యర్రగుంట్ల ప్రాంతానికి చెందిన తరుణ్(36) శ్రీకాళహస్తి సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ... పట్టణంలోని ముత్యాలమ్మగుడివీఽధిలోని సత్యసాయిబాబా సందులో స్నేహితుడితో కలసి అద్దె ఇంట్లో ఉండేవాడు. మూడు రోజులుగా తరుణ్ తలుపులు తెరవకపోవడం, గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ విశ్వనాథ్, టూటౌన్ సీఐ శివరాముడు, రూరల్ సీఐ కృష్ణమోహన్, వన్టౌన్ ఎస్ఐ సంజీవకుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లగా యువకుడి మృతదేహం కనిపించింది. గొంతుపై కత్తితో కోసి ఉండటంతో పాటు మృతదేహంపై రక్తగాయాలు ఉన్నట్లు గుర్తించారు. నాలుగు రోజుల కిందట హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రేణిగుంటకు చెందిన తరుణ్ స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, తిరుపతి అర్బన్ ఏఎస్పీ అరీఫుల్లా గురువారం రాత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.