మొబైల్ గేమ్ గొడవ ముదిరి మూడిళ్లపై దాడి
ABN , First Publish Date - 2020-12-01T05:47:28+05:30 IST
పిల్లల మొబైల్ గేమ్ కారణంగా చెలరేగిన వివాదం ముదిరిపోయి దాడులకు దారితీసింది
వెదురుకుప్పం, నవంబరు 30:పిల్లల మొబైల్ గేమ్ కారణంగా చెలరేగిన వివాదం ముదిరిపోయి దాడులకు దారితీసింది. ఎస్ఐ ప్రవీణ్కుమార్, గ్రామస్తుల కథనం మేరకు.... పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ కన్నికాపురం బీసీ కాలనీ, కన్నికాపురం గ్రామానికి చెందిన పిల్లలు ఆదివారం మొబైల్ గేమ్ ఆడారు.ఓడిపోయిన కుర్రాడు గెలిచిన వాళ్లకు డబ్బివ్వలేకపోవడంతో అతడి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయమై వివాదం చెలరేగడంతో ఆదివారం పులిగుంటీశ్వర ఆలయం వద్ద పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలో కన్నికాపురానికి చెందిన కె.పవన్ మరికొందరు కలసి ఆదివారం రాత్రి బీసీకాలనీలోని టి.ధనలక్ష్మి, టి.శారద, టి.సుగుణ ఇళ్లపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. కిటికీ అద్దాలు పగలగొట్లారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మహిళలను దుర్భాషలాడారు. సోమవారం బాధితుల ఫిర్యాదు మేరకు కన్నికాపురానికి చెందిన కె.పవన్, కె.సందీప్, జి.హేమంత్, కె.సురేష్, కె.నిర్మల, జి.విమల, ఎం.సోము, టి.వెంకటేష్, ఢిల్లీ, ఎం.రెడ్డెప్ప, ఎం.గుణశేఖర్, ఎం.కిరణ్, ఎం.సాయి, పి.సాయి, జ్ఞానశేఖర్, ఎం.రాముపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చెప్పారు.