పొట్టకూటికోసమొచ్చి ప్రాణాలు కోల్పోయారు!
ABN , First Publish Date - 2020-06-25T11:24:04+05:30 IST
పొట్టకూటి కోసం రాష్ర్టాలు దాటి వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను దుఃఖ సముద్రంలో

కర్ణాటక సరిహద్దులో బోరు లారీ బోల్తా
ముగ్గురు యువకుల దుర్మరణం
పెద్దతిప్పసముద్రం, జూన్ 24: పొట్టకూటి కోసం రాష్ర్టాలు దాటి వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను దుఃఖ సముద్రంలో ముంచారు.చిత్తూరు జిల్లా సరిహద్దులో బుధవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. కర్ణాటక లోని చేలూరు పంచాయతీ పరిధిలో సరిహద్దు గ్రామమైన ఉప్పుకుంటపల్లె శివారులో తమిళనాడుకు చెందిన ఓ బోరు లారీ బోల్తా పడిన ఘటనలో మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన అవదేశ్(23) జగదేవ్(25) రాజారం(20) అక్కడికక్కడే మృతి చెందారు.
పుష్పరాజ్, ముఖేష్ తీవ్రంగా గాయపడ్డారు. బోరు లారీకి పైపులు తరలించే లారీలో వీరు ప్రయాణిస్తుండగా ఆ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. వీరు కింద పడగానే వీరిపై ఇనుప పైపులు పడడంతో కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. చింతామణికి చెందిన ఈ బోరు లారీ రవికుమార్ అనే ఏజెంటు ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో బోర్లు వేస్తోంది. హొసహొడ్యా గ్రామానికి చెందిన చౌడప్ప పొలంలో బోరు వేసేందుకు వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిక్బళ్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చేలూరు ఎస్ఐ చంద్రకళ కేసు దర్యాప్తు చేస్తున్నారు.