కౌండిన్య అభయారణ్యంలో జలసోయగాలు

ABN , First Publish Date - 2020-07-13T11:52:31+05:30 IST

రామకుప్పం మండలంలో మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కౌండిన్య ..

కౌండిన్య అభయారణ్యంలో జలసోయగాలు

రామకుప్పం/బైరెడ్డిపల్లె/ వి.కోట, జూలై 12: రామకుప్పం మండలంలో మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కౌండిన్య అభయారణ్యంలోని జలపాతాలు హొయలీనుతున్నాయి. వీర్నమల అటవీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగిప్రవహిస్తుండటంతో చెలిమిచేను, బడాలగట్టు జలపాతాలు కనువిందుచేస్తున్నాయి. ఈ రెండు జలపాతాలకు వెళ్లే దారి, జలపాతాల వద్ద రక్షణ ఏర్పాట్లు చేస్తే పర్యాటకులకు స్వర్గధామంగా ఉంటుంది. ఈ జలాలు తమిళనాడుకు వృథాగా పోతున్నాయి. జలపాతాల దిగువభాగంలో అటవీప్రాంతంలో భారీ చెక్‌డ్యాంలు నిర్మించి, జలాలను నిలువరించగల్గితే భూగర్భజలాలు సమృద్ధిగా ఉండే అవకాశం ఉంది. 


వన్యప్రాణులు దాహార్తి తీర్చుకునేందుకు పంటపొలాలు, జనావాసాల వైపు రాకుండా ఉంటాయి. అదేవిధంగా పలుచోట్ల ఉపాధికుంటలు, చెక్‌డ్యామ్‌లలో నీరు చేరాయి. మండలంలో అతిపెద్ద చెరువులైన ఎస్‌.గొల్లపల్లె పెద్దచెరువు, సింగసముద్రం పెద్దచెరువులు నిండుకుండల్లా మారాయి. హంద్రీ - నీవా కాలువలు కూడా వర్షపునీటితో నిండాయి. వి.కోట మండల పరిధిలో ఆదివారం 79 మి.మీ వర్షపాతం నమోదైంది. సరిహద్దులోని కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో తోటకనుమ మీదుగా కైగల్‌ నదికి భారీగా వరదచేరుతోంది. దుముకురాళ్ల జలపాతం పోటెత్తింది.  


కనువిందుచేస్తున్న కైగల్‌ జలపాతం

కొన్నేళ్లుగా వానలు లేక బోసిపోయిన బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్‌ జలపాతం ఆదివారం ఉదయం నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. జలకళ సంతరించుకుంది. బైరెడ్డిపల్లె, మిట్టపల్లె, మూలతిమ్మేపల్లె, కామినేపల్లె, కడపనత్తం చెరువుల్లోని గుంతల్లో వర్షపు నీరుచేరింది.   

Updated Date - 2020-07-13T11:52:31+05:30 IST