74,950 మందికి ‘జగనన్న తోడు’

ABN , First Publish Date - 2020-11-26T05:56:44+05:30 IST

జిల్లాలో 74,950 మంది జగనన్న తోడుకు అర్హతపొందారని, వారి ఖాతాల్లో రూ.74.95 కోట్లు జమకానుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు.

74,950 మందికి ‘జగనన్న తోడు’
సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

తిరుపతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 74,950 మంది జగనన్న తోడుకు అర్హతపొందారని, వారి ఖాతాల్లో రూ.74.95 కోట్లు జమకానుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బుధవారం ‘జగనన్న తోడు’ పథకాన్ని వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి నారాయణస్వామి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ఆదిమూలం, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్సలో పాల్గొన్నారు. మంత్రి మేకపాటి మాట్లాడుతూ.. పేదలందరూ ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతోనే సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారన్నారు. చిన్నస్థాయి అసంఘటిత వ్యాపారులు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలిచ్చేందుకు ముందుకొచ్చిన బ్యాంకులను అభినందించారు.  జిల్లాలో జగనన్న లబ్ధిదారుల శాతం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని కలెక్టర్‌ భరత్‌గుప్తా సీఎం జగన్‌కు వివరించారు.  ఈ సమావేశంలో కమిషనర్‌ గిరీష, డ్వామా పీడీ చంద్రశేఖర్‌, జేసీ(డీ) వీరబ్రహ్మం, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ గణపతి, తిరుపతి కార్పొరేషన్‌ ఏడీసీ హరిత, డీసీ చంద్రమౌళీశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


‘సచివాలయ’ నిర్మాణాలు వేగవంతం కావాలి 

గ్రామాల్లో సచివాలయ అనుబంధ నిర్మాణాలు వేగవంతంకావాలని మంత్రి పెద్దిరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడ పంచాయితీరాజ్‌ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి బుధవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాల్లో నరేగా అనుసంధాన నిర్మాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు. మార్చి నాటికి అన్ని నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ చంద్రశేఖర్‌, ఎస్‌ఈలు అమరనాథ్‌రెడ్డి (పీఆర్‌), సురేంద్రనాఽథ్‌ (ఇరిగేషన్‌), విజయకుమార్‌ (ఆర్‌డబ్ల్యూఎస్‌) పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T05:56:44+05:30 IST