హథీరాంజీ మఠంలో నగలు మాయం?
ABN , First Publish Date - 2020-07-10T19:11:23+05:30 IST
తిరుపతిలోని హథిరాంజీ మఠంలో బంగారు, వెండి నగలు మాయమైనట్లు మహంతు అర్జున్దాస్ గురువారం తన సిబ్బంది వద్ద అనుమానం వ్యక్తం చేశారు

తిరుపతి (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని హథిరాంజీ మఠంలో బంగారు, వెండి నగలు మాయమైనట్లు మహంతు అర్జున్దాస్ గురువారం తన సిబ్బంది వద్ద అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మఠం సిబ్బందిలో గుబులు పట్టుకుంది. మఠం వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు.. హథీరాంజీ మఠంలో అకౌంటెంట్గా పనిచేసే గుర్పప్ప ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మఠంలోని కొన్ని బీరువా తాళం చెవులు కనిపించకపోవడంతో సిబ్బంది గుర్రప్ప కుటుంబ సభ్యులను ఆరాతీశారు. వారు ఇంట్లో వెతికి మఠానికి చెందిన కొన్నితాళం చెవులు తీసుకొచ్చారు. అందరి సమక్షంలో బీరువా తాళం తెరచి చూడగా 108 గ్రాముల బంగారు డాలరు, 70 గ్రాముల వెండి చైను కనిపించకపోవడాన్ని ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో సిబ్బంది ఒకరుపై ఒకరు నిందలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొందరు పూజారులపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అప్రైజర్తో లెక్కకట్టి ఎన్ని నగలు పోయాయో తెలుపుతామని అధికారులు అంటున్నారు.