బాబాయ్ హత్యకు ప్రతీకారంగా.. స్నేహితులతో కలిసి..
ABN , First Publish Date - 2020-09-23T17:09:11+05:30 IST
తిరుపతిలో ఆదివారం రాత్రి జరిగిన రౌడీషీటర్ దినేష్ హత్యకేసును పోలీసులు..
రౌడీషీటర్ దినేష్ హత్యకు ప్రధాన నిందితుడి స్కెచ్
ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు
తిరుపతి(చిత్తూరు): తిరుపతిలో ఆదివారం రాత్రి జరిగిన రౌడీషీటర్ దినేష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. తన బాబాయ్ భార్గవ్ హత్యకు ప్రతీకారంగా ఇతడిని స్నేహితులతో కలిసి వినయ్ హతమార్చినట్లు వీరి విచారణలో తేలింది. అరెస్టు చేసిన ఏడుగురు నిందితులను మంగళవారం అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డి మీడియాకు చూపి.. వివరాలు వెల్లడించారు. ఆ ప్రకారం.. 2017లో గిరిపురంలో జరిగిన భార్గవ్ హత్య కేసులో రౌడీషీటర్ బెల్టు మురళి ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఆ హత్యకు ప్రతీకారంగా బెల్టు మురళిని గతేడాది డిసెంబరు 21న ప్రత్యర్థులు హతమార్చారు. ఈ హత్యకేసులో రౌడీషీటర్ దినేష్ ఏ11గా ఉన్నాడు.
ఈ క్రమంలో ఇతడిని హతమార్చాలని బెల్టు మురళి అన్న కుమారుడు వినయ్ నిర్ణయించుకున్నాడు. రెండుసార్లు రెక్కీ నిర్వహించినా అమలు కాలేదు. ప్రస్తుతం తన స్నేహితులు కోలా సాయికృష్ణ, వేపిరెడ్డి శ్రీనురెడ్డి, సాయికృష్ణ, కోసల శివకుమార్తో కలిసి దినేష్ హత్యకు వినయ్ స్కెచ్ వేశాడు. ఆదివారం సాయంత్రం ఆయుర్వేద వైద్యశాల గ్రౌండ్లో ఈ ఐదుగురూ మద్యం తాగారు. 7 గంటల నుంచి దినేష్ను వెంబడించారు. రాత్రి 9.30 గంటల సమయంలో గిరిపురంలోని తన ఇంటి వద్ద రోడ్డుపై దినేష్ ఉండగా స్కూటర్లపై వచ్చిన వీరు కత్తులతో పలుసార్లు పొడిచారు. మృతిచెందాడని నిర్ధారించుకుని ద్విచక్రవాహనాలపై పరారయ్యారు. రెండు కత్తులను మహతి పరిసరాల్లో పారేశారు.
దామినేడు వద్ద రెండు స్కూటర్లను, మరో కత్తిని వదిలేసి, ముందుగా ఏర్పాటు చేసుకున్న ఆటోలో గౌతం అలియాస్ సల్మాన్రాజు, సురేష్ అలియాస్ పప్పు అలియాస్ ఎర్రోడుతో కలిసి పారిపోయారు. నిందితుల కోసం వెస్ట్ డివిజన్ పోలీసులు మూడు బృందాలుగా గాలించారు. తిరుపతి ఆయుర్వేద కళాశాల గ్రౌండ్వద్ద మంగళవారం ఏడుగురు నిందితులు ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులకు నగర బహిష్కరణ ..
తిరుపతి పుణ్యక్షేత్రంలో విద్రోహ శక్తులకు చోటులేదని అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ అనుమతితో నిందితులందరినీ నగర బహిష్కరణ చేస్తామన్నారు. వీరిపై 15 రోజుల్లోపలే చార్జిషీట్ వేసి.. రిమాండ్లో ఉండగానే ట్రయల్స్ ప్రారంభమయ్యేలా చేస్తామని చెప్పారు. ఏ1 వినయ్ తదితరులు గ్యాంగ్ తయారుచేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ కేసును ఒక్కరోజులో ఛేదించిన వెస్ట్ డీఎస్పీ నరసప్ప, వెస్ట్, ఎస్వీయూ సీఐలు శివప్రసాద్, రవీంద్రనాథ్, వెస్ట్ ఎస్ఐలు ప్రవీణ్కుమార్, చలపతి, ఎంఆర్పల్లె ఎస్ఐ నరేంద్ర, వెస్ట్ ఐడీపార్టీ గోపాల్, వెంకటేశ్వరరావు, చిరంజీవి, రమేష్ను అభినందించి రివార్డులు అందజేశారు.