లాక్‌డౌన్‌ వేళ ఎలా?

ABN , First Publish Date - 2020-04-25T11:17:37+05:30 IST

కరోనా కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో పేదలకు ఇంటి పట్టాలు

లాక్‌డౌన్‌ వేళ ఎలా?

ఇళ్లస్థలాల లేఅవుట్లలో మౌలిక వసతులకు

ప్రతిపాదనలు పంపాలన్న ప్రభుత్వం


చిత్తూరు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన లేఅవుట్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం నాడు-నేడు కార్యక్రమం ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేయగా ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. తాజాగా పేదల కోసం పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన లేఅవుట్లలో మంచినీరు, విద్యుత్తు సౌకర్యం, ఇంటర్నల్‌ రోడ్లు వంటి వసతులను కల్పించేందుకు ఆయా శాఖలతో సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు పంపాలని గృహ నిర్మాణ శాఖకు ఆదేశాలందాయి. ఈ క్రమంలో జిల్లా అధికారులు కూడా మండల స్థాయిలో ఉండే ఏఈలకు ఈ పనులు చేయాల్సిందిగా పురమాయించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటే క్షేత్రస్థాయిలో నాలుగు శాఖల అధికారులు, సిబ్బంది 10 మందికి పైగా పర్యటించాల్సి ఉంటుంది.


జిల్లాలో 1.17 లక్షల మంది అర్హులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు 1318 ప్రాంతాల్లో లేఅవుట్లను సిద్ధం చేసి ఉంచారు. వాస్తవానికి ఉగాది నాటికి ఇంటి పట్టాలు అందించాలనుకున్నా.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ రావడం, ఆ తర్వాత కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. మొదట ఏప్రిల్‌ 14న పంపిణీ చేయాలని భావించినా.. లాక్‌డౌన్‌ పొడిగించిన కారణంగా మళ్లీ జూలైకి వాయిదా వేశారు.


ఆయా లేఅవుట్లలో విద్యుత్తు సౌకర్యం, అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటే ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌, విద్యుత్తు శాఖలతో గృహ నిర్మాణ శాఖ సమన్వయం చేసుకోవాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో పర్యటించి వసతుల అవసరాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ఇలా చేయాలంటే నాలుగు శాఖల నుంచి కనీసం పదిమందికి పైగా గుమికూడాల్సి వస్తుంది. కరోనా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పనులు చేపట్టడం కష్టమవుతుందని, లాక్‌డౌన్‌ అయిపోయాక ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-25T11:17:37+05:30 IST