పెళ్లి పేరుతో వంచన
ABN , First Publish Date - 2020-12-02T05:27:30+05:30 IST
ప్రేమపేరుతో నమ్మించాడు.. మాయమాటలతో మభ్యపెట్టాడు.. పెళ్లిపేరుతో వంచించాడు.. చివరకు గర్భవతిని చేశాడు..
ఏడో నెలలో బిడ్డను కని కన్నుమూసిన వలంటీర్
రామకుప్పం, డిసెంబరు 1 : ప్రేమపేరుతో నమ్మించాడు.. మాయమాటలతో మభ్యపెట్టాడు.. పెళ్లిపేరుతో వంచించాడు.. చివరకు గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోవాలని బాధిత యువతి నిలదీస్తే వాయిదా వేస్తూ వచ్చాడు.. ఈ క్రమంలో ఆ యువతి ఏడో నెలలో మగబిడ్డను కని అస్వస్థతకు గురై తనువు చాలించింది. పోలీసుల కథనం మేరకు.. రామకుప్పం మండలం కెంచనబల్ల పంచాయతీ గాంధీనగరానికి చెందిన రమాదేవి (24) వలంటీర్గా పని చేస్తోంది. శాంతిపురం మండలం వడగాండ్లపల్లెకు చెందిన సతీష్ (25) తరచూ గాంధీనగరంలోని బంధువుల ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో రమాదేవితో పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆమెను లోబరుచుకుని గర్భవతిని చేశాడు. పెళ్లి ప్రస్తావన తెస్తే వాయిదా వేస్తూ కాలయాపన చేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆమెను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. రమాదేవి తల్లి చెన్నమ్మ ఫిర్యాదు మేరకు సతీష్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు.