కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. ఆప్యాయంగా తాగమని చెప్పి..

ABN , First Publish Date - 2020-06-23T18:13:16+05:30 IST

మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ తీసుకొచ్చాడు. ఆప్యాయంగా..

కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. ఆప్యాయంగా తాగమని చెప్పి..

రూ.16.56 లక్షల నగలు, రూ.70 వేల నగదు చోరీ


తిరుపతి(ఆంధ్రజ్యోతి): మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ తీసుకొచ్చాడు. ఆప్యాయంగా తాగమన్నాడు. ఆపై రూ.16.56 లక్షల బంగారు నగలు, రూ.70 వేల నగదు అపహరించుకెళ్లాడు. తిరుపతిలో శనివారం జరిగిన నయవంచనకు పాల్పడిన ఆ వ్యక్తి గురించి సోమవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. అలిపిరి ఎస్‌ఐ షేక్షావలి తెలిపిన ప్రకారం.. తిరుమల శ్రీవారి పోటులో కాంట్రాక్ట్‌ ఉద్యోగి దయాకర్‌, ఆయన భార్య పద్మ సత్యనారాయణపురంలో ఉంటున్నారు. పద్మ పిన్ని శ్రీదేవి మైదుకూరులో ఉంటోంది.


భక్తి కార్యక్రమాల పేరిట ఆమెకు 50 ఏళ్ల వ్యక్తి ఇటీవల పరిచయం అయ్యాడు. రాహుకేతు పూజలు చేయించే పనిమీద వారం కిందట అతడితో కలిసి శ్రీదేవి తిరుపతిలోని పద్మ ఇంటికి వచ్చారు. తనకు వీలైనప్పుడు శ్రీవారి ప్రసాదాలు తీసుకువస్తే డబ్బిచ్చి తీసుకెళ్తానని ఆ వ్యక్తి చెప్తాడు. ఆ మేరకు ప్రసాదాలు తీసుకొనేందుకు శనివారం కూల్‌ డ్రింక్‌ తీసుకుని పద్మ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆమె భర్త విధులకు వెళ్లారు. ఆప్యాయంగా కూల్‌డ్రింక్‌ తాగమని చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో పద్మకు తెలియలేదు. ఎప్పటికో మెలకువ వచ్చాక చూస్తే ఒంటిపైన, బీరువాలో నగలు.. నగదు కనిపించలేదు. దీనిపై బాధితులు సోమవారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.16.56 లక్షల ఆభరణాలు రూ. 70వేల నగదు చోరీ అయినట్టు వెల్లడించారు. అలిపిరి ఎస్‌ఐ షేక్షావలి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-06-23T18:13:16+05:30 IST