కమిటీలతో సీఎం కాలయాపన
ABN , First Publish Date - 2020-12-31T05:29:56+05:30 IST
ఉద్యోగ సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు అన్నారు.
ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు
చిత్తూరు రూరల్, డిసెంబరు 30: ఉద్యోగ సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు అన్నారు. బుధవారం నగరంలోని ఆర్ఎల్ఎన్ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెండింగ్ డీఏల మంజూరు, పీఆర్సీ అమలు జాడ లేక ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొందని గుర్తుచేశారు. సీపీఎస్ రద్దు, మెరుగైన ఫిట్మెంట్ తదితర ప్రయోజనాలు కల్పిస్తామని పాదయాత్రలో సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి కమిటీల ఏర్పాటు చేసి కాలయాపన చేస్తున్నారనీ, హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. సమావేశంలో సంఘ నాయకులు శ్రీనివాసరావు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.