-
-
Home » Andhra Pradesh » Chittoor » boys died in penna river
-
చిన్నబోయిన ‘పెన్నమ్మ’... మృతదేహాల వద్ద కుటుంబీకుల ఆర్తనాదాలు
ABN , First Publish Date - 2020-12-19T06:47:41+05:30 IST
సరదాగా ఈత కోసం కోట సమీపంలో ఎనిమిది మంది నదిలో దిగారు. కాస్త లోపలకువెళ్లగానే ఇద్దరు సుడిగుండంలో చిక్కుకొని మునిగిపోతుంటే.. వారిని కాపాడేందుకు వెళ్లి ఒక్కొక్కరుగా గల్లంతయ్యారు.

వెలికి తీసిన మృతదేహాల వద్ద కుటుంబీకుల ఆర్తనాదాలు
‘నాన్న షన్ను లే.. లేనాన్నా ఇంటికెళ్దాం. సాయంత్రానికి వస్తానని చెప్పొచ్చి ఇలా అయ్యావా..! నీవు బైక్ బాగా నడుపుతావ్. నన్ను ఒక్కసారి ఎక్కించుకొని నడుపుదువు రా నాన్నా. వైఫై కావాలంటే ఏపించామ్.. ఇప్పుడు ఎవరు వాడాలి నాన్నా..! నీవులేకుండా మేమెలా బతకాలి..!’ అంటూ షణ్ముగశ్రీనివాస్ మృతదేహం వద్ద తల్లి మునిపార్వతి దుఃఖంతో ఏడుగురిని పొట్టన పెట్టుకున్న పెన్నమ్మ చిన్నబోయింది. ఆమె ఒక్కరే కాదు.. ఉజ్వలంగా ఎదగాల్సిన కన్నకొడుకులు కనిపించని లోకాలకు వెళ్లారంటూ యువకుల తల్లిదండ్రులందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎవరిని కదిపినా ఉబికివస్తున్న కన్నీళ్లతో దేవుడు ఎంత అన్యాయం చేశాడంటూ దుఃఖించారు.
ఒకరిని కాపాడబోయి మరొకరు..
తిరుపతి కొర్లగుంటలో ఉంటున్న సిద్దవటానికి చెందిన ఆర్టీసీ మెకానిక్ రామచంద్రయ్య 11 నెలలు కిందట మృతి చెందారు. ఈయన సంవత్సరీకాన్ని గురువారం స్వగ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రయ్య కుమారుడు వెంకటశివ తన మిత్రులు చెన్నకోణం సోమశేఖర్ (18), యశ్వంత్ (16), గాజుల షణ్ముఖశ్రీనివాస్ అలియాస్ షన్ను (19), ముటికవల్లి తరుణ్ (18), కాఫిరెడ్డి జగదీశ్వరరెడ్డి అలియాస్ జగదీష్ (18), కర్ణి మురళీసతీష్ (20), కొనగాలి రాజేష్ (18), మరో ముగ్గుర్ని తీసుకొచ్చాడు. వీరంతా పదో తరగతి, ఇంటర్ పూర్తి చేశారు. కార్యక్రమం తర్వాత 11 మందీ పెన్నానదికి వెళ్లారు. సరదాగా ఈత కోసం కోట సమీపంలో ఎనిమిది మంది నదిలో దిగారు. కాస్త లోపలకువెళ్లగానే ఇద్దరు సుడిగుండంలో చిక్కుకొని మునిగిపోతుంటే.. వారిని కాపాడేందుకు వెళ్లి ఒక్కొక్కరుగా గల్లంతయ్యారు.
తెల్లవారుజాము నుంచే గాలింపు
గురువారమే జాలర్ల సహకారంతో సోమశేఖర్, రాజేష్ మృతదేహాలను గుర్తించారు. ఇక, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఓఎ్సడీ దైవప్రసాద్, కడప సీసీఎస్ డీఎస్పీ రంగనాయకులు, ఒంటిమిట్ట సీఐ హనుమంతనాయక్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. సిద్దవటం జాలర్లు (యానాదులు), ఒంటిమిట్టకు చెందిన 10 మంది, అగ్నిమాపక సిబ్బంది 10 మంది, స్పెషల్ రెస్క్యూ టీం 30 మంది పవర్బోట్లు, అరగోళాల సహాయంతో నదిలో గాలింపు చేపట్టారు. ఉదయం 7.30 గంటల సమయంలో మురళీసతీష్, యశ్వంత్ మృతదేహాలను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో షణ్ముఖశ్రీనివాస్ మృతదేహం గుర్తించారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం ఒంటిమిట్ట నుంచి ప్రత్యేక జాలర్లు, అలివి వలలు తెప్పించి జల్లెడ పట్టారు. 12.45 గంటల సమయంలో తరుణ్ మృతదేహం లభించింది. జగదీష్ ఆచూకీ లభించలేదు. చీకటి పడేవరకు ఈయన తండ్రి బాలకృష్ణారెడ్డి నది ఒడ్డునే ఉబికివస్తున్న కన్నీటిధారలను తుడుచుకుంటూ నిరీక్షించారు. చీకట్లు కమ్ముకోవడంతో గాలింపు ఆపేశారు. నదిలో నుంచి వెలికితీసిన మృతదేహాలకు కడప రిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. కాగా, ప్రమాద స్థలాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట ఇన్చార్జి బత్యాల చెంగల్రాయులు సందర్శించారు. మృతుల కుటుంబీకులను పరామర్శించారు. పర్యాటక స్థలమైన సిద్దవటంలో పెన్నా వద్ద రక్షణ చర్యల ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎంత ఇచ్చినా కన్నవాళ్ల బాధ తీరనిదని, అయినా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలిచ్చి ఆదుకోవాలని కోరారు.
- సిద్దవటం/కడప, ఆంధ్రజ్యోతి
