జిల్లాకు నాలుగు పదవులు
ABN , First Publish Date - 2020-10-19T10:33:07+05:30 IST
జిల్లాకు నాలుగు పదవులు

బీసీ కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం
పెద్దిరెడ్డి వర్గానికే అందలం
చిత్తూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్ పదవులు దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. వీరిలో జిల్లా నుంచి నలుగురు ఉన్నారు. ఈ ఛైర్మన్ల జాబితా సెప్టెంబరు 30వ తేదీన బయటికొచ్చినా.. అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ప్రకటించడంతో ఆయా వర్గాలు స్థానికంగా ర్యాలీలు చేసి తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు. పదువులు పొందిన నలుగురూ మంత్రి పెద్దిరెడ్డి వర్గానికి చెందినవారే కావడం విశేషం. నగరి, చిత్తూరు ప్రాంతాల వారు స్థానిక నాయకత్వానికి అనుకూలంగా లేకపోయినా.. పెద్దిరెడ్డితో బాగుండటంతో ఈ పదవులు దక్కినట్లు తెలుస్తోంది.
మొదలియార్ కార్పొరేషన్ ఛైర్మన్గా చిత్తూరు నగరానికి చెందిన బుల్లెట్ సురే్షను నియమించారు. ప్రస్తుతం వైసీపీలో ఈయనకు ఎలాంటి పోస్టు లేదు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఈయన ప్రస్తుతం బీసీ కోర్ కమిటీ ఛైర్మన్గా పనిచేస్తున్నారు.
వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్గా కుప్పం మండలం మల్లానూరుకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వనితను నియమించారు. వైసీపీ ప్రారంభం నుంచీ ఈమె పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈమె మామ మురుగేష్ ప్రస్తుతం కుప్పం మండల వైసీపీ కన్వీనర్.
పాల ఏకిరి కార్పొరేషన్ ఛైర్మన్గా పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన తరిగొండ మురళీధర్ను ప్రకటించారు. 1986 నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీలో ఉంటున్నారు. ఎంపీపీగా, జడ్పీటీసీగా పనిచేశారు. మంత్రి పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడు.
ఈడిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్గా నగరి పట్టణానికి చెందిన కె.శాంతిని ప్రకటించారు. ఈమె 2014-19 కాలంలో నగరి మున్సిపల్ ఛైర్పర్సన్గా పనిచేశారు. ఈమె భర్త కేజే కుమార్ వైసీపీ ప్రారంభం నుంచీ జగన్ వెంటే కొనసాగుతున్నారు.