49 ఎర్రచందనం దుంగల స్వాధీనం
ABN , First Publish Date - 2020-12-13T06:45:16+05:30 IST
శ్రీవారి మెట్టు వద్ద దట్టమైన శేషాచలం అడవుల్లో 49 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఓ తమిళ స్మగ్లర్ అరెస్టు
చంద్రగిరి, డిసెంబరు 12: శ్రీవారి మెట్టు వద్ద దట్టమైన శేషాచలం అడవుల్లో 49 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఆంజనేయులు ఆదేశాలతో ఆర్ఎస్ఐ వాసు, డీఆర్వో నరసింహారావు బృందం శుక్రవారం మధ్యాహ్నం నుంచి శ్రీవారిమెట్టు ప్రాంతంలో బండరాళ్లను దాటుకుని దాదాపు 800 మీటర్ల ఎత్తు వరకు దట్టమైన అడవిలో కూంబింగ్ చేపట్టారు. శనివారం వేకువజామున 1.30 గంటల సమయంలో 50 మందికిపైగా స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకొస్తూ వీరికి కనిపించారు. దాంతో లొంగిపోవాలని స్మగ్లర్లను హెచ్చరించారు. వారు మాత్రం దుంగలు పడేసి.. చీకట్లో పరారయ్యారు. వెంబడించి.. ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ స్మగ్లర్.. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా మేల్మరవత్తూరుకు చెందిన రవిచంద్రన్గా గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతం నుంచి 49 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న డీఎస్పీలు వెంకటయ్య, గిరిధర్, సీఐలు సుబ్రహ్మణ్యం, వెంకటరవి, ఎఫ్ఆర్వో ప్రసాద్, ఎఫ్ఎస్వో నటరాజులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.