వైసీపీ అరాచక పాలన సాగిస్తోంది
ABN , First Publish Date - 2020-03-13T11:04:45+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, ధర్మవరం ఇన్చార్జి చిలకం మధుసూదన్రెడ్డి విమర్శించారు.
జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు చిలకం మధుసూదన్రెడ్డి
అనంతపురం క్రైం, మార్చి 12 : రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, ధర్మవరం ఇన్చార్జి చిలకం మధుసూదన్రెడ్డి విమర్శించారు. పోలీసుల సాక్షిగా జిల్లాలో జనసేన నాయకులు, కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడటం దారుణమని ఆరోపించారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వైసీపీకి వ్యతిరేకంగా పోటీలో నిలబడకూడదని వైసీపీ వర్గీయులు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులు, దాడులకు పాల్పడి మారణహోమం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల విషయంలో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించడం సరైందికాదన్నారు. ఇందుకు నిదర్శనంగా పోలీసుల సాక్షిగా జిల్లాలోని తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరంలో జరిగే రాళ్ల దాడులు స్పష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. వైసీపీ దాడులపై కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యఏసుబాబులకు ఫిర్యాదు చేశామన్నారు. దాడులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు జనసైనికులకు రక్షణ కల్పించి ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరామన్నారు.