అంగన్వాడీ కార్యకర్తపై గ్రామ వలంటీర్ దాడి
ABN , First Publish Date - 2020-07-08T22:37:54+05:30 IST
రోజురోజుకి గ్రామాల్లో వలంటీర్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. తమకు తిరుగులేదని..
కళ్యాణదుర్గం(అనంతపురం): రోజురోజుకి గ్రామాల్లో వలంటీర్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. తమకు తిరుగులేదని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా సరే తాము చెప్పినట్లు వినాల్సిందేనని దాడులకు సైతం తెగబడుతున్నారు. తాజాగా కళ్యాణదుర్గం మండలంలోని పాతచెరువు గ్రామంలో ఓ అంగన్వాడీ కార్యకర్తపై ఆ గ్రామ వలంటీర్ మంగళవారం బండరాయితో దాడి చేశాడు. వివరాలిలా ఉన్నాయి.
గ్రామంలోని మినీ అంగన్వాడీ కేంద్రంలో సువర్ణ కార్యకర్తగా పని చేస్తోంది. కరోనా నేపథ్యంలో మూడు నెలలుగా పిల్లల పౌష్టికాహారాన్ని వారి ఇళ్లకే వెళ్లి అందించింది. అయితే ఇటీవల ఆమెకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇళ్లకు వెళ్లలేకపోయింది. పౌష్టికాహారాన్ని కేంద్రానికి వచ్చి తీసుకెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో ఆమెను గ్రామ వలంటీర్ బోయ లింగప్ప పౌష్టికాహారాన్ని ఇళ్లకు వెళ్లి ఎందుకు ఇవ్వడంలేదని వేధిస్తున్నాడు.
మంగళవారం వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆవేశానికి గురైన వలంటీర్ సువర్ణపై బండరాయితో దాడి చేయగా.. చుట్టుపక్కలనున్న మహిళలు అడ్డుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఆమె స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకుంది. దాడిపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గ్రామ వలంటీర్ను అరెస్టు చేయాలి : ఉమా
అంగన్వాడీ కార్యకర్త సువర్ణపై దాడి చేసిన గ్రామ వలంటీర్ లింగప్పను అరెస్టు చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. వలంటీర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో నాయకులు దొడగట్ట నారాయణ, మాదినేని మురళి, సత్యప్ప, రామ్మోహన్, పాలవాయి రాము, తిమప్ప, మంజునాథరెడ్డి, శ్రీరాములు , హనుమంతరెడ్డి, రోషన్ తదితరులు పాల్గొన్నారు.