పంట నష్టపరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-05-13T10:17:07+05:30 IST

పంట నష్టపరిహారం బకాయిలను వెంటనే మంజూరు చేసి, రైతులను ఆదుకోవాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో

పంట నష్టపరిహారం ఇవ్వాలి

పంట రుణాల చెల్లింపులను వాయిదా వేయాలి..

కొత్త రుణాలివ్వాలి.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు..


అనంతపురం వైద్యం, మే12: పంట నష్టపరిహారం బకాయిలను వెంటనే మంజూరు చేసి, రైతులను ఆదుకోవాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు.. ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ 2018 ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వర్షాభావ పరిస్థితుల వల్ల పెద్దఎత్తున పంట నష్టపోయారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2300 కోట్ల పంట నష్టపరిహారం రైతులకు అందాల్సి ఉందన్నారు. అందులో సింహభాగం రాయలసీమ రైతులకు రావాల్సి ఉందన్నారు. కరువుకు ఆలవాలమైన అనంతపురం జిల్లాలో 6,95,403 మంది రైతులకు రూ.967.40 కోట్ల పంట నష్టపరిహారం అందాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులు రైతు కుటుంబాలను తీవ్ర ఆర్థికసంక్షోభంలోకి నెట్టేశాయన్నారు.


తక్ష ణం ప్రభుత్వం బకాయి ఉన్న పంట నష్టపరిహారం సొమ్ము విడుదల చేసి, అన్నదాతలను ఆదుకోవాలన్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావటంతో బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు రెన్యువల్‌ చేసుకోవటానికి రైతన్నలు అవస్థలు పడుతున్నారన్నారు. వడ్డీతోపాటు అసలు చెల్లిస్తేనే బ్యాంకులు రెన్యువల్‌ చేస్తున్నాయన్నారు. బయట అప్పులు పు ట్టక, బ్యాంకు రుణాలు చెల్లించటానికి రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయన్నారు. పంట రుణాల చెల్లింపును వాయిదా వేయించాలన్నారు. కొత్త రుణాలను మంజూరు చేయించి, అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఈనెల 3వ వారం నుంచి సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. పంట నష్టపరిహారం సొమ్ము విడుదల చేస్తేనే రైతులు సబ్సిడీ విత్తనాలు కొనుగోలు చేయగలరన్నారు. ఈనేపథ్యంలో అన్నదాతలకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-05-13T10:17:07+05:30 IST