ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-12-29T06:12:20+05:30 IST
అప్పులు తీర్చలేక, బతికే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి కాలవ
రాయదుర్గం రూరల్, డిసెంబరు 28: అప్పులు తీర్చలేక, బతికే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని బీఎన హళ్లి గ్రామంలో ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఏ బాధిత కుటుంబాన్ని పరామర్శించినా వారి బాధలు వర్ణనాతీతమన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అటు ప్రభుత్వాధికారులు, పాలకులు గానీ పట్టించుకున్న పాపానపోలేదన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.7 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించి, రూ.రెండు లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటోందన్నారు. బాధిత ముగ్గురు రైతుల కుటుంబాల్లో ఆడపిల్లలు, మాటలురాని చిన్న పిల్లలు వుండటం కలచివేసిందన్నారు. ఇప్పటికైనా మోసపు మాటలు మాని, రైతు కుటుంబాలకు బాసటగా నిలవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు హనుమంతు, హనుమంతరెడ్డి, గుమ్మఘట్ట జడ్పీటీసీ అభ్యర్థి కాలవ సన్నణ్ణ, నాయకులు విజయ్కుమార్, సోమశేఖర్, లచ్చన్న, మద్దానప్ప, ఎంపీటీసీ పురుషోత్తమ్, వన్నూరప్ప, సింగయ్య చౌదరి, హనుమంతరాయుడు పాల్గొన్నారు.
ఇది రైతు భక్షక ప్రభుత్వం
పామిడి : రాషా్ట్రన్ని పాలిస్తున్న వైసీపీ రైతు భక్షక ప్రభుత్వమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్ విమర్శించారు. సోమవారం మండలంలోని రామరాజుపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను అనంతపురం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు ఎంఎస్ లక్ష్మీనారాయణ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న భోగాతి బయపరెడ్డి, అనూష, మహానంద ఆచారి, చిన్న తిమ్మారెడ్డి కుటుంబీకులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రైతులను పుట్టెడు అప్పుల్లోకి నెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు నామమాత్రంగా సంక్షేమ ఫలాలు అందజేసి గోరంతను కొండంతలు చేసి ప్రచారం చేసుకుంటోందన్నారు. ఇటీవల విడుదల చేసిన పంట నష్టపరిహారంలోనూ రైతులకు మొండి చేయి చూసిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ముసలి రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధానకార్యదర్శి శివశంకర్, నాయకులు నాగేశ్వరరెడ్డి, నాగేశరెడ్డి, జయరామిరెడ్డి, జింకల రామకృష్ణ, బాబా, బాబావలి, విష్ణు పాల్గొన్నారు.
