రాత్రి 8 గంటల తరువాత బయటకు రావొద్దు

ABN , First Publish Date - 2020-03-25T11:11:12+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదని ఎస్పీ సత్యఏసుబాబు అదేశించారు.

రాత్రి 8 గంటల తరువాత  బయటకు రావొద్దు

ఎస్పీ సత్యఏసుబాబు 


అనంతపురం క్రైం, మార్చి 24 : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదని ఎస్పీ సత్యఏసుబాబు అదేశించారు. ఆ దిశగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారని పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని టవర్‌క్లాక్‌, సప్తగిరిసర్కిల్‌, శ్రీకంఠం, తాడిపత్రి బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును డీఎస్పీ వీరరాఘవరెడ్డితో కలిసి ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడక్కడా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండటం, వాహనాలు తిరుగుతుండటంతో పోలీసు అధికారులకు తగిన విధంగా దిశానిర్దేశం చేశారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాపించకుండా ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్లపైకి వస్తే తగిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదన్నారు. వివాహాలు, పండుగలు, ఉత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలన్నారు. నిత్యావసరాల కోసం కుటుంబంలో ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి త్వరగా ఇళ్లకు చేరుకోవాలన్నారు. మీ పరిసర ప్రాంతాలకు విదేశాల నుంచి వచ్చినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరికైనా అత్యవసరమైతే డయల్‌-100కు సమాచారం అందించి పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐలు ప్రతాపరెడ్డి, రెడ్డెప్ప, జాకీర్‌ హుసేన్‌, కత్తి శ్రీనివాసులు, రాజశేఖర్‌, మురళీధర్‌ రెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2020-03-25T11:11:12+05:30 IST