ఫైరింగ్ ఔట్.. సోలార్ ఇన్..!
ABN , First Publish Date - 2020-12-02T06:43:19+05:30 IST
జిల్లా అభివృద్ధి నిమిత్తం ఫైరింగ్రేంజ్ ఏర్పాటు చేయాలని 2009లో కళ్యాణదుర్గం ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాల భూ సేకరణ చేశారు.
సోలార్తో ఎవరికి లాభం?
పదేళ్లుగా రైతులకు అందని పరిహారం
ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు జీవో రద్దుతో రైతులకు ఊరట
నెడ్క్యాప్ ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు సర్వే
కళ్యాణదుర్గం, డిసెంబరు 1: జిల్లా అభివృద్ధి నిమిత్తం ఫైరింగ్రేంజ్ ఏర్పాటు చేయాలని 2009లో కళ్యాణదుర్గం ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాల భూ సేకరణ చేశారు. అందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ సహకారా లు అందకపోవడంతో కరువు రైతులు పదేళ్లుగా నిశ్చేష్టులై ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఫైరింగ్ రేంజ్ను రద్దు చేయడం రైతులకు కొంత ఊరట కలిగించినా.. ఇప్పుడు అదే ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు పూనుకోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు, రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని మద్దెలచెరువు గ్రామాల సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 2009లో సుమారు 14,780.14ఎకరాలు భూమిని ఫై రింగ్ రేంజ్ ఏర్పాటుకు సేకరించారు. రాళ్ల అనంతపురం, డీ చెన్నేపల్లి, నూతిమడుగు, తిప్పేపల్లి, కర్తనపర్తి, సీవీ తండా, రామోజీనాయక్ తండా, మద్దెల చెరువు, మద్దెల చెరువుతండా గ్రామాలకు చెందిన సు మారు 650మంది రైతుల భూములను సేకరించారు. సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటుచేశారు. దీంతో రైతులు భూములను సాగుచేసుకో లేక, బ్యాం కుల్లో రుణ సదుపాయం తదితర సౌకర్యాలు అందక తీవ్రం గా నష్టపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కర్తనపర్తి గ్రామ రైతు లు తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేశారు. రక్షణశాఖ అధికారులు భూముల పర్యవేక్షణకు వచ్చినప్పుడల్లా వారిని అడ్డుకునేవారు. ఫైరింగ్ రేంజ్కు భూములు కేటాయింపును రద్దుచేయాలని అప్పటి ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, నాటి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి రఘువీరారెడ్డికి ఈ ప్రాంత పాలకులతో కలిసి విన్నవించిన సందర్భాలు అనేకం. కా గా పదేళ్లు గడుస్తున్నా ఫైరింగ్ రేంజ్కు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫైరింగ్రేంజ్ను ర ద్దు చేస్తూ 2019 డిసెంబర్ 5న జారీ చేసిన 492వ జీవోతో ఆ రైతులకు ఊరట కలిగింది.
ఇప్పుడు సోలార్ ప్రాజెక్టుకు సన్నాహాలు
గతంలో ఫైరింగ్ రేంజ్కు కేటాయించిన భూముల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముమ్మర సర్వే సాగుతోంది. కానీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు తో ఎవరికి లాభం? అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఫైరింగ్ రేం జ్ కోసం తీసుకున్న భూములకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. ప దేళ్ల పాటు ఆ భూములు బీడు పడడంతో పాటు కంపచెట్లు పెరిగి ఎం దుకు పనికిరాకుండా పోయాయి. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేర కు అదే ప్రాంతంలో నెడ్క్యాప్ ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కు రెవెన్యూ అధికారులు భూములను సర్వేచేసి రైతులను గుర్తిస్తున్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాలు భూకేటాయింపు కోసం సర్వే లు జ రుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కంబదూరు ప్రాం తంలో సుమారు 10వేల ఎకరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఎకర భూమిని ఏడాదికి రూ.25వేలతో లీజ్కు తీసుకుంటున్నట్లు తెలిసింది. ముందుకొచ్చిన రైతులు 33ఏళ్ల పాటు ఆ కంపెనీకి అగ్రిమెంట్ చేయించాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంపై రైతులకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రెవెన్యూ అధికారుల చుట్టూ పరుగులు తీస్తున్నారు.
ఉచిత విద్యుత్ కోసమే..
పగటిపూట తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందు కే ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఏపీజీఈసీఎల్ (ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్) ఆధ్వర్యంలో జిల్లాలోని తాడిపత్రి సమీపంలో ఊరిచిం తల గ్రా మం వద్ద 600మెగావాట్లతో, ముదిగుబ్బ వద్ద 600 మెగావాట్లు, కంబదూ రు వద్ద 1200 మెగావాట్లతో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగానే నె డ్క్యాప్ (న్యూ అండ్ రెన్యోబుల్ ఎనర్జీ డవల్పమెంట్ కార్పొరేషన్) ఆ ధ్వర్యంలో భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ పనులు త్వరతిగతిన పూర్తిచేసి సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కు ఆదివారం టెండర్లు పిలిచినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఆర్డీఓ రామ్మోహన్, కంబదూరు తహసీల్దార్ ఈశ్వరయ్యశెట్టి సిబ్బంది తో కలిసి శనివారం నూతిమడుగులో గ్రామసభ నిర్వహించారు. సోలా ర్ ప్రాజెక్టు ఉపయోగాలు, రైతులకు లబ్ధి చేకూరే అంశాలను వివరించే ప్రయత్నం చేశారు. అయితే గతంలోనూ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసి రైతులకు పరిహారం అందజేస్తామని నమ్మించి మోసం చేశారని ఆయా గ్రామ ప్రజలు, రైతులు అధికారులను నిలదీశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ పొలాలను సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇచ్చేది లేదని భీష్మించారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మాత్రం సరిపోద న్నారు. 300 ఎకరాల ప్రభుత్వ భూమి మినహా తక్కినవి పట్టాభూములని, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వెలకట్టాలని ఆర్డీఓను కోరారు. ఓ ప్రజాప్రతినిధి స్వలాభం కోసమే భూసేకరణ పనులు ముమ్మరం చేసి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.