-
-
Home » Andhra Pradesh » Ananthapuram » raithu sangham nirasana
-
వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ పోరాటం
ABN , First Publish Date - 2020-12-27T06:22:32+05:30 IST
అన్నదాతల కడుపుకొట్టి అంబానీ, ఆదానీల ఆదాయం పెంచే దిశగా కేంద్రం వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేసేవరకూ పోరాటం కొనసాగుతుందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక క్లాక్టవర్ వద్ద నిరసన దీక్ష నిర్వహించారు.

ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి
అనంతపురం టౌన్, డిసెంబరు 26: అన్నదాతల కడుపుకొట్టి అంబానీ, ఆదానీల ఆదాయం పెంచే దిశగా కేంద్రం వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేసేవరకూ పోరాటం కొనసాగుతుందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక క్లాక్టవర్ వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ‘జై జవాన్.. జై కిసాన్’ అన్న మోదీ నేడు ‘జై అంబానీ.. జై ఆదానీ’ అంటున్నారని ఎద్దేవా చేశారు. 30 రోజులుగా అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న 500 సంఘాలు ఏకతాటిపై నిలిచి ఢిల్లీ కేంద్రంగా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా నిరసన తెలుపుతున్నాయన్నారు. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా తట్టుకుని రైతాంగ పోరాట జ్యోతిని వెలిగించారన్నారు. పదుల సంఖ్యలో తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారన్నారు. ఇప్పటికైనా నల్ల చట్టాలను రద్దు చేయాలనీ, లేనిపక్షంలో పోరాటం మరింత తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు బాలరంగయ్య, కృష్ణమూర్తి, రైతుకూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర యాదవ్, సీఐటీయూ జిల్లా నాయకుడు ఆంజనేయులు పాల్గొన్నారు.