ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ చట్టాలు రద్దు చేసేదాకా పోరాటం
ABN , First Publish Date - 2020-03-02T10:23:30+05:30 IST
దేశ ప్రజలకు ప్రమాదకరమైన ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ చట్టాలు రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని వామపక్ష, లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు పేర్కొన్నారు.

9న అనంతలో భారీ బహిరంగ సభ
విజయవంతం చేయాలని బస్సుయాత్ర ప్రారంభం
అనంతపురం క్లాక్టవర్, మార్చి 1 : దేశ ప్రజలకు ప్రమాదకరమైన ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ చట్టాలు రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని వామపక్ష, లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు పేర్కొన్నారు. ఈనెల 9న నగరంలో నిర్వహించే ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేక భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం బస్సుయాత్ర ప్రారంభించారు. స్థానిక ఎన్జీఓ హోం వద్ద వామపక్ష, లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పెద్దన్న, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, ఆవాజ్ రాష్ట్ర నాయకుడు మహ్మద్చస్తి, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు సాలార్బాషా మాట్లాడారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతాలు, కులాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. అందులో భాగంగానే ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ చట్టాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈనెల 9న నిర్వహించే భారీ బహిరంగసభకు ముఖ్య అతిథులుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు, కర్ణాటక ఎమ్మెల్సీ ఇబ్రహీం హాజరవుతారన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్, నారాయణస్వామి, సీపీఎం జిల్లా దక్షిణప్రాంత కార్యదర్శి ఇంతియాజ్, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గసభ్యుడు వేమయ్యయాదవ్, సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు శ్రీరాములు, నాగేంద్రకుమార్, సీపీఐ నగర సహాయ కార్యదర్శులు రమణ, అల్లీపీరా, సీపీఎం జిల్లా నాయకులు శ్రీనివాసులు, బాలరంగయ్య, రామిరెడ్డి, నాగరాజు, సీపీఐ, సీపీఎం, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.