కర్రతో దాడి చేసి.. ఇంటి నుంచి గెంటేశారు
ABN , First Publish Date - 2020-08-16T18:20:28+05:30 IST
మానవత్వం మరచి రక్త సంబంధీకులే వృద్ధురాలిపై కర్రతో దాడి చేసి..

90 ఏళ్ల వృద్ధురాలిపై కుటుంబీకుల కర్కశత్వం
లేపాక్షి(అనంతపురం): మానవత్వం మరచి రక్త సంబంధీకులే వృద్ధురాలిపై కర్రతో దాడి చేసి తల పగలకొట్టి ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఈ హృదయవిదారక సంఘటన శుక్రవారం సాయంత్రం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 90 ఏళ్ల వృద్ధురాలు ఫాతిమకు కొడుకులు, మనమళ్లు అందరూ ఉన్నారు. కానీ ఎవరూ కూడా ఆమెను ఆదరించలేదు. అన్నం పెట్టేవారు కాదని, ఇంట్లోకి వెళ్తే బయటికి నెట్టేసేవారని, తాగడానికి నీరు కూడా ఇవ్వరని శనివారం ఆమె కన్నీరుమున్నీరయింది. శుక్రవారం కర్రతో తలపై కొట్టి నెట్టేశారని, రక్తం కారుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లానని, అక్కడకూడా వైద్యం అందించకపోగా బయటకు గెంటేశారని విలపించింది. రాత్రంతా ఆర్టీసీ బస్టాండులో చలికి వణుకుతూ కాలం వెళ్లదీశానంది. ఆమె దీన స్థితిని చూడలేక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సద్గురుడు స్పందించి వృద్ధురాలికి న్యాయం చేస్తానని తెలిపారు.