అడుగుకో లేఅవుట్
ABN , First Publish Date - 2020-12-11T06:14:42+05:30 IST
మండలంలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అహుడా, పంచాయతీల అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా వెలుస్తున్నాయి
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వైనం
అనంతపురం రూరల్ మండలంలో వందల సంఖ్యలో ఏర్పాటు
అహుడా, పంచాయతీ అనుమతులూ లేని వైనం
ప్రభుత్య ఆదాయానికి గండి
నిబంధనలకు తిలోదకాలు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
అనంతపురం రూరల్ మండలంలోని చిన్నంపల్లి సమీపాన 5 ఎకరాలకుపైగా లేఅవుట్ వేశారు. అధికార పార్టీ నేతలు వేసిన దీనికి ఎలాంటి అనుమతులూ లేవు. పంచాయతీకి 10 శాతం భూమిని రిజిస్టర్ చేయించాల్సి ఉంది. అది కూడా చేయించలేదు.
కురుగుంట సమీపంలో అనంతపురం-కళ్యాణదుర్గం ప్రధాన రహదారి పక్కనే ఏకంగా 9 ఎకరాలకుపైగా లేఅవుట్ వేశారు. ఇక్కడ పంచాయితీకి సెంటు భూమి కూడా రిజిస్టర్ చేయించిన దాఖలాల్లేవు. దానికి ఎదురుగా ఉన్న 4.16 ఎకరాల్లో లేఅవుట్ వేసేందుకు జోరుగా పనులు సాగుతున్నాయి. ఈ భూమి గతంలో ల్యాండ్ సీలింగ్లో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించినట్లు సమాచారం. టీడీపీ హయంలో కొంతమంది నాయకులు ఆ భూమికి సంబంధించిన రికార్డులను అప్పటి రెవెన్యూ అధికారులతో తారుమారు చేయించి, వారి పేర్లు మీదుగా చేయించుకున్నారు. ప్రభుత్వం మారగానే ఆ భూమి అధికార పార్టీ నేతలకు చేరింది. ఇప్పుడు సంబంధిత నాయకులు ఆ భూమిలో లేఅవుట్లు వేయటానికి ఏర్పాట్లు సాగిస్తున్నారు.
ఆలమూరు పంచాయతీ పరిధిలోనూ అక్రమ లేఅవుట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. గ్రామ సమీపంలోని ఓ సర్వే నెంబరులో 9 ఎకరాలు లేఅవుట్ వేశారు. ఇక్కడ పంచాయతీకి అడుగు కూడా స్థలం కేటాయించిన దాఖలాల్లేవు.
ఎ.నారాయణపురం పంచాయతీ పరిధిలోనూ లేఅవుట్లు విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. ఇటీవల గ్రామ సమీపంలో 2 ఎకరాలకుపైగా లేఅవుట్ వేశారు. ఇందులోనూ పంచాయతీకి స్థలం కేటాయించలేదు. వ్యవసాయేతర భూమిగా మార్చకపోవటం గమనార్హం. ఇలా ప్రతి పంచాయతీ పరిధిలోనూ అక్రమ లేఅవుట్లు వెలిశాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు.
అనంతపురంరూరల్, డిసెంబరు 10: మండలంలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అహుడా, పంచాయతీల అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. నగరానికి అన్ని వైపులా 20 కిలో మీటర్ల వరకు ప్రధాన రోడ్లకు అటూ.. ఇటూ.. పెద్దఎత్తున లేఅవుట్లు, వెంచర్లు వెలిశాయి. అనంతపురం రూరల్ మండలంలోనే వందల సంఖ్యలో ఉన్నాయి. దీంతో పంచాయతీలోని స్థలాలకు భారీ డిమాండ్ పెరిగింది. జిల్లా కేంద్రానికి దగ్గర ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు గద్దల్లా వాలిపోతున్నారు. చకచకా ప్లాట్లు వేసేసి, అమ్మకానికి పెట్టేస్తున్నారు. ఫలితంగా ఇటు రెవెన్యూకు చలానా రూపంలో 3శాతం, అటు పంచాయతీలకు ఓపెన్ సైట్ రూపంలో పెద్దఎత్తున గండి పడుతోంది. అయినా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు కన్నెత్తి చూడట్లేదు. లేఅవుట్లు వేస్తున్న వారిలో ఎక్కువశాతం మంది అధికార పార్టీ నేతల కు సంబంధించిన వారే కావటమే ఇందుకు కారణం. దీంతో సంబంధిత అధికారులు అక్రమంగా లేఅవుట్లు పడుతున్నాయని తెలిసిన.. అటువైపు చూడట్లేదన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
నగరానికి కూతవేటు దూరంలోనే..
నగరానికి ఆనుకుని మండలం ఉండటం కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా కలిసొస్తోంది. కురుగుంట, రుద్రంపేట, చిన్నంపల్లి, ఏ.నారాయణపురం, ఆకుతోటపల్లి, ఉప్పరపల్లి, ఆలమూరు, కక్కలపల్లి, అక్కంపల్లి, రాచానపల్లి, కొడిమి, ఇటుకలపల్లి తదితర ప్రాంతాలు నగరానికి 10కిలోమీటర్లలోపే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అయినా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. నగరానికి దగ్గరగా ఉండటంతో వ్యాపారులు చెప్పిన మాయమాటలకు నమ్మి, ప్రజలు లేఅవుట్లు అక్రమ, సక్రమం అన్నవీ చూడకుండానే కొనుగోలు చేస్తున్నారు.
కొనుగోలు చేస్తే వినియోగదారులకు కష్టాలే..
అక్రమ లేఅవుట్లు కొనుగోలు చేస్తే వినియోగదారులకు కష్టాలు తప్పవన్న అ భిప్రాయాలను పంచాయతీ అధికారులు వెల్లడిస్తున్నారు. అక్రమ లేఅవుట్లు కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంత వరకు ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడం కారణంగా బిల్లిండింగ్ అఫ్రూవల్ ఇచ్చే అవకాశం ఉండదని సంబధిత అధికారులు వెల్లడిస్తున్నారు. బ్యాంకు రుణాలు రావంటున్నారు. అహుడా పరిధిలోని లేఅవుట్లు అయితే ఒకసారి సంబంధిత అధికారులు అక్రమ లేఅవుట్లు అని రిజిస్ట్రేషన్ శాఖకు తెలిపితే రిజిస్ట్రేషన్లు చేసే ఆస్కారం ఉండదు. ఓపెన్ సైట్ ఇడవని కారణంగా భవిష్యత్తులో ప్రజా అవసరాలకు స్థలాలు లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇంటి లా పరిస్థితులే జిల్లాలోని అధికారులకు ఎదురువుతున్నాయి. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణాలు చేపట్టేందుకు స్థలాలకు లేకుండాపోయాయి.
కనీస నింబధనలు పట్టించుకోని వైనం..
వ్యవసాయ భూముల్లో వెంచర్లు, లేఅవుట్లు వేయాలంటే మందుగా వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. తరువాత వ్యవసాయేతర భూమిగా మార్చాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 12 మంది మాత్రమే ల్యాండ్ కన్వర్షన్కు దరఖాస్తు చేసుకున్నట్లు రెవెన్యూ లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఒక్కో పంచాయతీలో పదుల సంఖ్యలో లేఅవుట్లు వేశారు. లేఅవుట్ వేసే పంచాయతీకి 10 శాతం స్థలం రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. 30 అడుగుల రోడ్లు వేయాల్సి ఉంటుంది. చాలా లేఅవుట్లలో 25 అడుగులే వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అనుమతులివ్వలేదు
మండలంలో లేఅవుట్లు వేయటానికి ఇటీవల అనుమతులివ్వలేదు. లేఅవుట్లు వేసేవారు తప్పని సరిగా అనుమతులు తీసుకోవాలి. పంచాయతీకి స్థలాన్ని రిజిస్టర్ చేసివ్వాలి. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేస్తే వాటిని తొలగిస్తాం. - అలివేలమ్మ, ఈఓఆర్డీ