విచారణకు శ్రీకారం

ABN , First Publish Date - 2020-11-19T06:24:03+05:30 IST

కొందరు ఉపాధ్యాయులు దొడ్డిదారిన ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ సర్టిఫికెట్లు పొందటంపై జిల్లా విద్యాశాఖాధికారులు విచారణకు దిగారు.

విచారణకు శ్రీకారం
సర్టిఫికెట్లు స్వీకరిస్తున్న ప్రత్యేక సెల్‌ అధికారులు


టీచర్ల బోగస్‌ ప్రిఫరెన్షియల్‌

 సర్టిఫికెట్లపై స్పందించిన డీఈఓ

ధ్రువపత్రాలు అందజేయాలంటూ ఎంఈఓలకు 

ఆదేశాలు.. స్వీకరణకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు

ఆంధ్రజ్యోతి వార్తకు స్పందన



అనంతపురం విద్య, నవంబరు 18: కొందరు ఉపాధ్యాయులు దొడ్డిదారిన ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ సర్టిఫికెట్లు పొందటంపై జిల్లా విద్యాశాఖాధికారులు విచారణకు దిగారు. బదిలీల్లో 20 శాతం హెచ్‌ఆర్‌ఏ స్థానాలు, దగ్గరి ప్లేసు లు పొందేందుకు కొందరు ఉపాధ్యాయులు అడ్డదారిలో బోగస్‌ సర్టిఫికెట్లు పొందటంపై ‘ఇవే నేర్పుతున్నారా?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ప్రచురించిన కథనంతో అధికారులు మేల్కొన్నారు. ఇది విద్యాశాఖ, ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లేని రోగాలు చూపి, బోగస్‌ సర్టిఫికెట్లు పొంది న వారిలో గుబులు రేకెత్తించింది. ఈ దొడ్డిదారి వ్యవహారంపై డీఈఓ శామ్యూల్‌ విచారణకు సిద్ధమయ్యారు. ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ సర్టిఫికెట్ల స్వీకరణకు జిల్లా కేంద్రంలోని సైన్స్‌ సెంటర్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను సైన్స్‌ సెంటర్‌లో అందజేయాలంటూ మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. తన లాగిన్‌కు పంపాలన్నారు. మధ్యాహ్నం నుంచి పలు మండలాల నుంచి వచ్చిన సర్టిఫికెట్లను సైన్స్‌ సెంటర్‌లో ప్రత్యేక సెల్‌ అధికారులు స్వీకరిస్తున్నారు. బుక్కరాయసముద్రం, నార్పల తదితర మండలాల నుంచి ధ్రువపత్రాలు అందాయి.



Updated Date - 2020-11-19T06:24:03+05:30 IST