ఈడ్చుకెళ్లి స్టేషన్లో వేయండి !
ABN , First Publish Date - 2020-09-20T08:56:54+05:30 IST
వాళ్లను ఈడ్చుకెళ్లి స్టేషన్లో వేయండి. తర్వాత నేనొచ్చి మాట్లాడుతా..’ అంటూ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బీజేపీ అను

ఏబీవీపీ నాయకులపై ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆగ్రహం
నార్పల, సెప్టెంబరు 19: ‘...వాళ్లను ఈడ్చుకెళ్లి స్టేషన్లో వేయండి. తర్వాత నేనొచ్చి మాట్లాడుతా..’ అంటూ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ నాయకులపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నార్పలలో శనివారం ప్రభుత్వ వైద్యశాలను ప్రారంభానికి వస్తున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎడ్యుకేషనల్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు వస్తున్న కాన్వాయ్ను ఏబీవీపీ నాయకులు గాంధీ సర్కిల్ వద్ద అడ్డుకున్నారు.
నార్పల బాలికల వసతి గృహాన్ని శ్మశానం వద్ద నిర్మించకూడదని ఎన్నిసార్లు అర్జీలిచ్చినా పట్టించుకోలేదంటూ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది వారిని తోసేయడానికి ప్రయత్నించి ముందుకు సాగారు. అయినప్పటికీ ఏబీవీపీ నాయకులు ససేమీరా అంటూ ఎమ్మెల్యే కాన్వాయ్కు మ రోసారి అడ్డుపడ్డారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ‘ఏం తమాషా చేస్తున్నారా... వీరిని ముందు స్టేషన్కు తీసుకెళ్లండి. నేనొచ్చి మాట్లాడుతా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆదేశించారు. వెంటనే పోలీసులు ఆందోళన చేస్తున్న విశ్వనాథ్, సాయినాథ్, పార్థు తదితరులను అరెస్టు చేసి బలవంతంగా జీపుల్లో ఎక్కించి స్టేషన్కు తరలించారు.