బియ్యమే.. కందిపప్పు లేదు!
ABN , First Publish Date - 2020-04-02T10:35:43+05:30 IST
జిల్లాలో ఉచిత సరుకుల పంపిణీని కొందరు డీలర్లు, అధికారులు చాలా అలుసుగా తీసుకుంటు న్నారన్న విమర్శలు వినిపి స్తున్నాయి.
సగం మండలాల్లో కంది బేడల కొరత
కొన్ని ఎఫ్పీ షాపులకు వచ్చినా పంపిణీ చేయకుండా దాచేస్తున్న వైనం
బియ్యంతోనే సరిపెడుతున్న డీలర్లు
తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూలైన్లో కార్డుదారులు
ఆలస్యంగా షాపులు తెరవడంతో ఇక్కట్లు
సర్వర్ సమస్యతో అర్ధంతరంగా బంద్
పట్టించుకోని అధికారులు
అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్ 1 : జిల్లాలో ఉచిత సరుకుల పంపిణీని కొందరు డీలర్లు, అధికారులు చాలా అలుసుగా తీసుకుంటు న్నారన్న విమర్శలు వినిపి స్తున్నాయి. కోవిడ్ - 19 విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఇదే క్రమంలో ప్రజలకు ఉచితంగా బి య్యం, కంది బేడలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ముందస్తుగా జిల్లాకు కా వాల్సిన కంది బేడలు సరఫరా చేయలేకపో యారు. పూర్తిస్థాయిలో సరుకులు రాకుండానే జిల్లా యంత్రాంగం ఆర్భాటంగా సరు కుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. బుధవారం నాలుగో రోజూ సరుకుల పంపిణీ కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా సగం మండలాల్లోని ఎఫ్పీ షాపు లకు కంది బేడలు ఇప్పటికీ అందలేదు.
దీంతో బియ్యం మాత్రమే అందించి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు కంది బేడలు సరఫరా చేసిన షాపుల్లోనూ పంపిణీ చేయడం లేదు. తమకు కూడా కంది బేడలు ఇంకా రాలేదంటూ బుకాయి స్తుండటం గమనార్హం. షాపులకు వచ్చిన వారికి వీఆర్వోతో వేలిముద్ర వేయించుకొని బియ్యం ఇచ్చి పంపుతున్నారు. స్టాక్ రాలేదన్న కారణాన్ని అందిపుచ్చుకునేందుకే పలు ప్రాంతాల్లోని డీలర్లు కుయుక్తులు పన్నుతున్నారన్న ఆరోపణలున్నాయి. అనంత పురం నగరంలోని పాతూరులోని ఓ ఎఫ్పీ షాపుల్లో కంది బేడలు సరఫరా చేసినా కార్డుదారులకు ఇవ్వలేదని సమా చారం. షాపు లోపలి భాగంలో కంది బేడల సంచులు ఉంచుకొని తమకు ఇవ్వడం లేదంటూ కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించాలని అధి కారులు సూచించినా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. పలు షాపుల్లోనే ఈ విధానం అమలవుతోంది.
సగం మండలాల్లో కంది బేడల కొరత
జిల్లా వ్యాప్తంగా 3012 ఎఫ్పీ షాపులున్నాయి. వాటి పరిధిల్లో 12 లక్షల కార్డులున్నాయి. నవశకం సర్వేలో 10.5 లక్షల కార్డులను బియ్యం కార్డులకు అర్హులుగా తేల్చారు. అయితే లాక్డౌన్ అత్యవసర పరిస్థితుల్లో 12 లక్షల కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కందిబేడలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని సగం మండలాల్లో ఇప్పటికీ కంది బేడలు సరఫరా చేయలేదని తెలిసింది. కూడేరు, గార్లదిన్నె, అనంతపురం రూరల్ మండలం, అనం తపురం నగరంలో సగానికిపైగా ఎఫ్పీ షాపులు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, గుత్తి రూరల్, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కంబదూరు, బెళుగుప్ప తదితర మండలాల్లో ఇప్పటి దాకా కంది బేడలు సరఫరా కాలేదు.
ఆయా ప్రాంతాల్లో బియ్యం మాత్రమే పంపిణీ చేసి పంపిస్తున్నారు. కంది బేడలకు మళ్లీ రావాలని చెబుతు న్నారు. గత రెండు రోజులుగా కార్డుదారులు కంది బేడలకు మరోమారి షాపులకు వెళ్లినా ఇంకా స్టాక్ రాలేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు కంది బేడలు ఇస్తారో.... ఇవ్వరోనన్న ఆందోళనలో కార్డు దారులు పడ్డారు. వీఆర్వో,వీఆర్ఏ వేలిముద్రలతో సరుకులు పంపిణీ చేస్తున్న క్రమంలో కంది బేడలు బొక్కే సేందుకు కొందరు డీలర్లు రంగం సిద్ధం చేసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆలస్యంగా షాపులు తెరవడంతో ఇక్కట్లు
ఉచిత సరుకుల కోసం బుధవారం తెల్లవారు జాము 4.30 గంటలకే పలు ఎఫ్పీ షాపుల వద్దకు కార్డుదారులు క్యూకట్టారు. అయితే ఆయా ప్రాంతాల్లో ఉదయం 7.30 గంటలకుపైన షాపులు తెరవడం గమనార్హం. ఉదయం 6 గంటలకే షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించినా డీలర్లు పాటించడం లేదు. దీంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి పలు ప్రాంతాల్లో సర్వర్ డౌన్ కావడంతో సరుకులు పంపి ణీ బంద్ అయ్యింది. ఎంతసేపటికీ సర్వర్ పనిచేయక పోవడంతో షాపులు బంద్ చేయడంతో కార్డుదా రులు నిరాశగా ఇంటి ముఖం పడ్డారు. దీంతో తెల్లవారుజాము నుంచి క్యూలైన్లో నిరీక్షించినా ఫలితం లేకుండా పోయిం దని బాధితులు ఆవేదన చెందుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చొలేక వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అనంతపురం నగరంలోని రాణినగర్లోని రెండు ఎఫ్పీ షాపులు, ఆజాద్ నగర్లోని ఓ ఎఫ్పీ షాపులకు ప్రజలు తెల్లవారుజామునే వచ్చినా ఉదయం 7.30 గంటల తర్వాత షాపులు తెరవడం గమనార్హం. ఆలస్యం గా షాపులు తెరవడం, సర్వర్ సమస్యలతో సరుకులు తీసుకునేందుకు మధ్యాహ్నం అవుతోంది. సంచిలో సరుకులు తీసుకొని వెళు తున్నా అనంతపురం నగరంలోని కొందరు పోలీసులు కార్డుదారులను మందలిస్తు న్నారు. ఎఫ్పీ షాపుకు వెళ్లి వస్తున్నా మని చెప్పినా ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపైకి రావద్దంటూ లాక్డౌన్ నిబంధనలు చెబుతూ హెచ్చ రికలు జారీ చేస్తుండటం గమనార్హం.
సివిల్సప్లై అధికారుల పర్యవేక్షణ నిల్
ఉచిత సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా జరుగుతున్నా సివిల్సప్లై అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. స్థానిక సివిల్సప్లై అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి కార్డుదారులకు ఉచిత సరుకులు సవ్యంగా అందేలా చేయాల్సి ఉండగా.. ఆ దిశగా ఎవరూ ఆలోచించడం లేదన్న విమర్శలు న్నాయి.
కంది బేడలు ఇవ్వలేదు : బాలరాజు, కార్డుదారుడు, రాణినగర్, అనంతపురం
ప్రభుత్వం ఉచితంగా బియ్యం, కందిబేడలు ఇస్తామని చెప్పింది. మాకు కంది బేడలు ఇవ్వ లేదు. బియ్యం మాత్ర మే ఇచ్చి పంపుతున్నారు. కంది బేడలు ఇవ్వాలని అడిగితే మళ్లీ రావా లంటున్నారు. ఎప్పుడు రావాలంటే సరైన సమా ధానం చెప్పడం లేదు. ఈ రోజు తెల్లవారు జాము నుంచే క్యూలైన్లో నిల్చొని ఉన్నా. రెండు సార్లు రావా లంటే ఎలా. మళ్లీ వచ్చినా కంది బేడలు ఇస్తారో లేదో..? ఎవరికి తెలుసు.