ఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-10-27T10:18:45+05:30 IST
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబా న్ని కాటేశాయి. కరోనా లాక్డౌన్తో 8 నెలలపాటు వ్యాపారం లేకపోవటం, అప్పుల ఒత్తిడి పెరగటంతో మనస్తాపం చెంది పట్టణానికి చెందిన దంపతులు సద్దా ప్రసాద్ (48), సద్దా లత (45) ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
కదిరి, అక్టోబరు 26: ఆర్థిక సమస్యలు ఓ కుటుంబా న్ని కాటేశాయి. కరోనా లాక్డౌన్తో 8 నెలలపాటు వ్యాపారం లేకపోవటం, అప్పుల ఒత్తిడి పెరగటంతో మనస్తాపం చెంది పట్టణానికి చెందిన దంపతులు సద్దా ప్రసాద్ (48), సద్దా లత (45) ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వీరు పట్టణంలోని బైపాస్ రోడ్డు పక్కన చీరల షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తుండేవారు. వీరికి కుమారుడు అనుదీప్ రెడ్డి, కుమార్తె చరిత ఉన్నారు. కుమారుడు ఇంటర్మీడియట్, కుమార్తె బీటెక్ చదువుతున్నారు. ఈనెల 22వ తేదీ తెల్లవారుజామున తిరుమల వెళ్తున్నట్లు కుమారుడికి చెప్పి, దంపతులు పాత హరిజనవాడలోని ఇంటి నుంచి షాపు వద్దకొచ్చారు. ముందుభాగంలో తాళాలు వేసి, వెనుక వైపు నుంచి షాపు లోపలికెళ్లారు. అనంతరం ఒకే తాడుతో ఉరేసుకుని, ప్రాణం తీసుకున్నారు. రెండు రోజులుగా కుమారుడు ఫోన్ చేస్తున్నా.. తల్లిదండ్రుల నుంచి సమాధానం లేదు. దీంతో కొడుకు.. తన తాత చిన్నశేషయ్యకు విషయం చెప్పాడు. ఈనెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఫోన్ కాల్స్ను ట్రాక్ చేశారు.
కదిరిలోనే ఉన్నట్లు గుర్తించారు. ఈనెల 25న ఉదయమే దంపతులు ఆత్మహత్య చేసుకున్న షాపు వద్ద దుర్వాసన వస్తోందని స్థానికులు చెప్పారు. చిన్నశేషయ్య అక్కడికెళ్లి చూసి, విషయాన్ని పోలీసులకు తెలిపాడు. పోలీసులు వచ్చి ముందు వైపునున్న తలుపులు బద్దలు కొట్టి, లోపలికెళ్లగా.. ప్రసాద్, లత ఉరికి వేలాడుతూ కనిపించారు. పోలీసులకు సెల్ఫోన్తోపాటు సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులోని వివరాలను బట్టి అప్పుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.