అన్నదాత ఇంట అంతులేని శోకం..
ABN , First Publish Date - 2020-10-04T08:59:36+05:30 IST
మండలంలోని ఉదిరిపికొండ గ్రామానికి చెందిన రైతులు, తండ్రీకొడుకులు ఆదినారాయణ(60), వెంకటేష్ (27) శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందారు.
అప్పుల సేద్యంతో తండ్రీకొడుకులు కుటుంబ భారాన్ని మోస్తున్నారు. అయినా.. పట్టు వీడలేదు. ఈసారి కూడా వరి నాటారు. ఇంతలోనే పంటను నీరు ముంచేసింది. కళ్ల ముందే విద్యుత్ మోటారు కూడా మునుగుతుండటంతో కాపాడుకునేందుకు ఆరాటపడ్డారు. ఆ బతుకు పోరాటంలో ఇద్దరినీ కరెంటు కాటేసింది. కష్టాల కాడిని వీడి.. కలిసే కన్నుమూశారు. కుటుంబంలో అంతులేని శోకం నింపుతూ.. కన్నీటి సంద్రంలో ముంచుతూ.. అందరినీ అనాథలను చేస్తూ..
కూడేరు, అక్టోబరు 3: మండలంలోని ఉదిరిపికొండ గ్రామానికి చెందిన రైతులు, తండ్రీకొడుకులు ఆదినారాయణ(60), వెంకటేష్ (27) శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందారు. ఆదినారాయణ, మారెక్క దంపతులకు కుమారుడు వెంకటేష్, ఇద్దరు కుమార్తెలున్నారు. వారికి పెళ్లిళ్లయ్యాయి. వీరికి రెండెకరాల పొలం ఉంది. అందులో బోరు బావి కింద వరి నాటారు. మిడ్ పెన్నార్ డ్యాంకు నీరు వస్తుండటంతో బ్యాక్ వాటర్ వీరి పొలాన్ని ముంచెత్తుతూ వస్తోంది.
పంట సగం మునిగింది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులందరూ పొలానికెళ్లారు. పొలంలోని వ్యవసాయ మోటారు మునిగిపోతుండటంతో తండ్రీకొడుకులు దానిని బయటకు తీసుకు రావటానికి వెళ్లారు. ఆ ఆరాటంలో విద్యుత్ సరఫరా ఉందన్న విషయాన్ని కూడా మరిచారు. మోటారును తీసే క్రమంలో విద్యుత్ షాక్ కొట్టడంతో నీటిలోనే పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు కేకలు వేసుకుంటూ వెళ్లి స్టార్టర్ పెట్టెలో ఉన్న ఫ్యూజులు తొలగించారు. వారి అరుపులు విన్న చుట్టుపక్కల పొలాల్లోని రైతులు వచ్చి, నీటిలో నుంచి తండ్రీకొడుకులను బయటికి తెచ్చారు. అప్పటికే వారు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇంటి భారం మోసే తండ్రీకొడుకులిద్దరూ ఆ కుటుంబం దిక్కులేనిదైపోయింది. వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటేష్కు భార్య మహేశ్వరి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాద స్థలాన్ని ఎస్ఐ యువరాజ్, సిబ్బంది పరిశీలించారు. ఆదినారాయణ భార్య మారెక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డ్యాం బ్యాక్ వాటర్లో పంట కూడా మునగటంతో ఆ కుటుంబం సర్వం కోల్పోయింది.