అర్హులైన రైతులందరికీ వాతావరణ బీమా అందిస్తాం : జేడీఏ
ABN , First Publish Date - 2020-12-19T06:34:48+05:30 IST
సకాలంలో వాతావరణబీమా ప్రీ మియం చెల్లించి, ఈ-క్రాప్ బుకింగ్ చేయించిన అర్హులైన ప్రతి రైతుకు వాతావరణ బీమా అందేలా చూస్తామని వ్యవసాయశాఖ జేడీ రామకృష్ణ తెలిపారు.
కంబదూరు, డిసెంబరు 18: సకాలంలో వాతావరణబీమా ప్రీ మియం చెల్లించి, ఈ-క్రాప్ బుకింగ్ చేయించిన అర్హులైన ప్రతి రైతుకు వాతావరణ బీమా అందేలా చూస్తామని వ్యవసాయశాఖ జేడీ రామకృష్ణ తెలిపారు. ఆయన శుక్రవారం ఏడీఏ విశ్వనాథ్, ఏఓ మహేష్, ఏ ఈఓ ద్రాక్షయిణితో కలిసి మండలంలోని కురాకులపల్లిలో పర్యటించారు. గ్రామ సచివాయం వద్ద రైతులకు జేడీఏ వాతావరణ బీమా వి షయంపై క్షుణంగా వివరించారు. సకాలంలో వాతావరణబీమా చెల్లించిన రైతుల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హత ఉంటే తప్పనిసరిగా బీమా సొమ్ము అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. బీమా సొమ్ము పొందని రైతులు సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇవ్వాలన్నారు. అర్జీ ఇచ్చిన రైతుల వివరాలను ఆన్లైన్లో పరిశీలించి, సమగ్ర వివరాలను పొందపరిచి ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీఈఓలు, రైతులు పాల్గొన్నారు.