11 గంటలకే ఎమర్జెన్సీలో డాక్టర్ ఔట్
ABN , First Publish Date - 2020-12-15T06:55:50+05:30 IST
జిల్లా సర్వజనాస్పత్రిలో పాలనను గాడిలో పెట్టేందుకు నూతన సూపరింటెండెంట్ నవీద్ ప్రయత్నిస్తున్నారు.
సూపరింటెండెంట్ అసంతృప్తి
పలు విభాగాలను పరిశీలించిన నవీద్
అనంతపురం వైద్యం, డిసెంబరు 14: జిల్లా సర్వజనాస్పత్రిలో పాలనను గాడిలో పెట్టేందుకు నూతన సూపరింటెండెంట్ నవీద్ ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రిలో చాలామంది వైద్యులు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బాధ్య తలు తీసుకున్న తర్వాత ప్రతిరోజూ వార్డులు పరిశీలిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కూడా అనేక విభాగాలను ఆయన పరిశీలించారు. ఎమర్జెన్సీ విభాగంలో ఉదయం 11 గంటలకే డ్యూటీ డాక్టర్ కనిపించకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆడాక్టర్ వచ్చాక తనను కలవమని చెప్పండని అక్కడి నర్సులను ఆదేశించారు. ఏఎంసీలో ఇన్పేషంట్లు ఉంటున్న విభాగాన్ని పరిశీలించా రు. హౌస్ సర్జన్ యూనిఫాం లేకుండా విధులు నిర్వర్తించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న రోగుల కేసు షీట్లను పరిశీలించగా అందులో వారి వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్ఏబీహెచ్ నిబంధనల మేరకు కే షీట్లలో రోగుల వివరాలు పక్కాగా నమోదు చేయాలని వైద్యులు, నర్సులను సూపరింటెండెంట్ ఆదేశించారు. ఆయన వెంట ఆర్ఎంఓ డాక్టర్ వైవీరావు ఉన్నారు.